కేంద్రానికి షాక్: ఏకంగా 5 కీలక బిల్లులు బంద్! ప్రతిపక్షాల వ్యూహాత్మక దెబ్బ..
నేటితో ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు భారత రాజకీయంలో ఒక కొత్త చర్చకు తెరలేపాయి. జులై 20న సమావేశాలు ప్రారంభమైన సమయానికి, బెంగాల్ ఎన్నికల ఫలితాలు , వివిధ పార్టీల ఎంపీల చేరికతో అధికార ఎన్డీఏ కూటమి పూర్తి ఆధిక్యంలో కనిపించింది. ప్రతిపక్షాలు తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం సభలో సులభంగానే తన అజెండాను నెరవేర్చుకుంటుందని విశ్లేషకులు భావించారు. కానీ, సభ ముగిసే సమయానికి సీన్ పూర్తిగా తిరగబడింది. విద్యార్థుల ఉద్యమం ఇచ్చిన మైలేజీని వ్యూహాత్మకంగా వాడుకున్న విపక్షాలు, పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని గట్టి డిఫెన్స్లో పడేశాయి.
ఈ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు తెచ్చిన అనేక బిల్లులు ప్రతిపక్షాల ఆందోళనల హోరులో కొట్టుకుపోయాయి. దేశ రాజకీయ చిత్రాన్ని మార్చే నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు.. 'వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్' (VBSA) బిల్లు, ఎఫ్సీఆర్ఏ (FCRA) సవరణ బిల్లు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ బిల్లు, అరెస్ట్ అయిన ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లులు ఆమోదం పొందలేకపోయాయి. ముఖ్యంగా డెలిమిటేషన్ విషయంలో డీఎంకే మద్దతు కూడగట్టాలని కేంద్రం భావించినప్పటికీ, కాంగ్రెస్ నాయకత్వంలో విపక్షాలు అమలు చేసిన పక్కా వ్యూహంతో ప్రాంతీయ పార్టీలేవీ ఎన్డీఏ వైపు మొగ్గు చూపలేకపోయాయి. ఫలితంగా లోక్సభ పర్ఫామెన్స్ కేవలం 19 శాతానికి, రాజ్యసభ 39 శాతానికి పడిపోయింది.

'చలో సంసద్' సెగ.. విద్యార్థుల పోరుతో దిగొచ్చిన సర్కార్!
దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన 'చలో సంసద్' పిలుపు ఈ సమావేశాలకు ప్రధాన మలుపుగా మారింది. నిరసన తెలుపుతున్న అహింసయుత విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ తుపాకులు వాడారనే ఆరోపణలను ప్రతిపక్షాలు అస్త్రంగా మలచుకున్నాయి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధితులైన విద్యార్థులను కలవడం, ప్రధాని నివాసం వద్ద అనూహ్య ధర్నాకు దిగడం వంటి చర్యలతో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ఈ నిరసనల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందంటే.. ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
అమిత్ షాకు సవాల్.. ఆగిపోయిన టీ పార్టీ సంప్రదాయం!
విద్యార్థులపై పోలీసుల ప్రవర్తనపై హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. గత బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలపై విరుచుకుపడిన అమిత్ షా, ఈ సమావేశాల్లో మాత్రం విపక్షాల నిరసనల నడుమ చివరి రోజు మాత్రమే లోక్సభలో స్వల్ప సమయం కనిపించడం గమనార్హం. సభ ముగింపు సందర్భంగా స్పీకర్ ఇచ్చే సాంప్రదాయ తేనీటి విందుకు కూడా "హోంమంత్రి ఉంటే మేము రాము" అని కాంగ్రెస్ తెగేసి చెప్పడం.. ప్రభుత్వం , విపక్షాల మధ్య పెరిగిన తీవ్రమైన వైరాన్ని స్పష్టం చేస్తోంది.
ఏకపక్షంగా సాగుతుందనుకున్న వర్షాకాల సమావేశాలలో ప్రతిపక్షం తీవ్రమైన ప్రతిఘటనను ఎదురొడ్డి నిలిపింది. ప్రజా సమస్యలను, విద్యార్థుల ఆక్రోశాన్ని పార్లమెంట్ అజెండాగా మార్చడంలో విపక్షాలు సాధించిన ఈ విజయం.. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లోనూ, బయట కూడా మరిన్ని సవాళ్లు విసిరే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications