WHO అలర్ట్: మళ్లీ ప్రపంచానికి మహమ్మారి గండం, వందల్లో శవాల దిబ్బలు
ప్రపంచాన్ని మరోసారి భయంకరమైన మహమ్మారి వణికిస్తోంది. ఆఫ్రికన్ దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు మానవాళి చూసిన ఎబోలా విజృంభణలన్నింటిలోనూ ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మే నెల మధ్యలో ప్రారంభమైన ఈ మరణాల పరంపర కేవలం మూడు నెలల్లోనే వెయ్యి దాటి తీవ్రరూపం దాల్చింది. రోజులు గడుస్తున్నకొద్దీ దీని ఉధృతి తగ్గకపోగా, మరింత వేగంగా వ్యాపిస్తుండటంతో అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా దీనిని ప్రకటించి హెచ్చరిస్తున్నారు.
చాపకింద నీరులా విస్తరిస్తున్న 'బండిబుగ్యో' రకం!
ప్రస్తుతం కాంగోలో వణికిస్తున్న ఎబోలా సాధారణ రకం కాదు, దీనిని 'బండిబుగ్యో' అనే ప్రత్యేక స్ట్రెయిన్గా గుర్తించారు. ఇప్పటికే 4 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా, దాదాపు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. విచారకరమైన విషయమేమిటంటే.. ఈ మరణాల్లో సగానికి పైగా గత మూడు వారాల వ్యవధిలోనే సంభవించాయి. ముఖ్యంగా ఇటురి ప్రాంతంలో మహిళలు, చిన్న పిల్లలు ఎక్కువగా ఈ రక్కసి బారినపడుతున్నారు. వైద్య వర్గాల్లో కలవరం రేపుతున్న అంశమేమిటంటే.. ఈ వైరస్ శరవేగంగా వ్యాపించడమే కాకుండా, తన రూపం మార్చుకుంటూ మరింత ప్రమాదకరంగా మారుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శాశ్వత నివారణ లేదు.. వికటిస్తున్న అంతర్యుద్ధాలు!
ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు శ్రమిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితులు అస్సలు సహకరించడం లేదు. గనుల సంపద ఎక్కువగా ఉండే కాంగో తూర్పు ప్రాంతంలో సాయుధ దళాల మధ్య తరచూ జరిగే గొడవలు, హింసాత్మక ఘటనలు వైద్య బృందాలకు పెద్ద ఆటంకంగా మారాయి. అజ్ఞానం, అవగాహన లోపం కారణంగా స్థానికులు బయటి నుంచి వచ్చే వైద్యులను నమ్మకపోగా, సుమారు డజనుకు పైగా ఎబోలా చికిత్సా కేంద్రాలపై దాడులు చేశారు. అన్నిటికంటే భయంకరమైన విషయమేమిటంటే.. ప్రస్తుతం వ్యాపిస్తున్న 'బండిబుగ్యో' రకానికి ఇంకా ఆమోదించబడిన టీకా గానీ, ప్రత్యేకమైన మందులు గానీ అందుబాటులో లేకపోవడమే.
శరీర ద్రవాలతో కాటు వేసే కాళసర్పం!
ఎబోలా అనేది కేవలం జ్వరం మాత్రమే కాదు, ఇది అవయవాలను సైతం దెబ్బతీసే ఒక భయంకరమైన వ్యాధి. గబ్బిలాలు, అటవీ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ఈ వైరస్.. ఆ తర్వాత మనుషుల నుంచి మనుషులకు రక్తం, చెమట, ఇతర శరీర ద్రవాల ద్వారా వేగంగా సోకుతుంది. చర్మంపై చిన్న గాయం ఉన్నా, కళ్లు, ముక్కు ముట్టుకున్నా ఈ వైరస్ బాడీలోకి ప్రవేశిస్తుంది.
తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు కావడం, ఆ తర్వాత శరీరంలోపల, బయట రక్తస్రావం కావడం దీని ప్రధాన లక్షణాలు. గతంలో ఈ వ్యాధి బారిన పడిన వారిలో 50 శాతం నుంచి 90 శాతం వరకు చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతానికి బాధితులకు ద్రవాహారం ఇస్తూ ప్రాణాలు కాపాడే ప్రయత్నాలు తప్ప, సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రపంచానికి ఈ ఎబోలా ముప్పు తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications