పొరపాటున వేరేవాళ్లకు డబ్బులు పంపారా? వెంటనే ఇలా చేస్తే మీ సొమ్ము వాపస్!
డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి జీవితం యూపీఐతో ముడిపడిపోయింది. కూరగాయల షాపు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతీచోట ఒక్క క్లిక్తో క్షణాల్లో డబ్బులు పంపేస్తున్నాం. అయితే, ఇదే వేగం ఒక్కోసారి పెద్ద చిక్కు తెచ్చిపెడుతుంది. తొందరపాటులోనో లేదా ఒక అక్షరం, అంకె తప్పుగా నొక్కడం వల్లనో మన డబ్బులు వేరే వ్యక్తి ఖాతాలోకి వెళ్లిపోతుంటాయి. అలాంటప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తడం సహజం. అయితే, యూపీఐ ద్వారా పొరపాటున ట్రాన్స్ఫర్ అయిన డబ్బును నేరుగా 'క్యాన్సిల్' చేసే ఆప్షన్ యాప్లలో లేకపోయినప్పటికీ.. సరైన సమయంలో స్పందిస్తే మన సొమ్మును తిరిగి పొందడం ఖచ్చితంగా సాధ్యమే.
ముందుగా మీరు చేయాల్సిన పనులు ఇవే!
పొరపాటు జరిగిందని గుర్తించిన మరుక్షణమే ఏమాత్రం ఆలస్యం చేయకుండా చర్యలు ప్రారంభించాలి. మీరు చేసిన లావాదేవీకి సంబంధించిన అన్ని వివరాలను సురక్షితంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ట్రాన్సాక్షన్ ఐడీ, యూటీఆర్ నంబరు, ఎంత మొత్తం పంపారు, ఏ తేదీన, ఏ సమయానికి పంపారనే వివరాలు చాలా కీలకం. ముందుగా మీరు వాడిన యూపీఐ యాప్ (గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం మొదలైనవి)లోనే సదరు లావాదేవీని ఎంచుకుని 'రైజ్ డిస్ప్యూట్' లేదా 'హెల్ప్ అండ్ సపోర్ట్' ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలి. దానితో పాటు వెంటనే మీ బ్యాంకు కస్టమర్ కేర్కు ఫోన్ చేసి, తప్పుగా వేరే వ్యక్తికి నగదు వెళ్లినట్లు సమాచారం అందించాలి.

బ్యాంకులు డబ్బులు వెనక్కి తెప్పిస్తాయా?
ఒక్కసారి ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక, మీ బ్యాంకు నేరుగా అవతలి వ్యక్తి ఖాతా నుంచి డబ్బులు లాగేసుకోలేదు. కానీ, మీ బ్యాంకు అధికారులు అవతలి వ్యక్తి ఉన్న బ్యాంకు అధికారులతో మాట్లాడి రికవరీ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇక్కడ సమయమే అత్యంత ముఖ్యం! పొరపాటు జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మీరు ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ పొరపాటున నగదు పొందిన వ్యక్తి మంచి మనసుతో ఆ సొమ్మును వెనక్కి ఇవ్వడానికి సమ్మతిస్తే పని త్వరగా పూర్తవుతుంది. కానీ ఆ వ్యక్తి సహకరించకపోతే, బ్యాంకులు కూడా చట్టపరమైన అనుమతులు లేదా నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
యాప్, బ్యాంకు స్పందించకపోతే తదుపరి మార్గం!
ఒకవేళ మీరు వాడే యూపీఐ యాప్ లేదా మీ బ్యాంక్ నుంచి సరైన పరిష్కారం లభించకపోతే, కంగారు పడాల్సిన పనిలేదు. నేరుగా ఎన్పీసీఐ అధికారిక వెబ్సైట్ను ఆశ్రయించవచ్చు. అందులో ఉన్న డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్ (వివాద పరిష్కార వ్యవస్థ) ద్వారా యూపీఐ లావాదేవీపై నేరుగా ఫిర్యాదు నమోదు చేసే వెసులుబాటు ఉంది. అధికారులు మీ ఫిర్యాదును పరిశీలించి సదరు బ్యాంకులను ఆదేశిస్తారు.
జాగ్రత్తే శ్రీరామరక్ష.. ఫ్రాడ్ వేరు, పొరపాటు వేరు!
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం పొరపాటున వేరేవాళ్లకు డబ్బులు పంపడం వేరు, ఆన్లైన్ సైబర్ మోసగాళ్ల బారినపడి డబ్బులు పోగొట్టుకోవడం వేరు. ఒకవేళ మీరు సైబర్ నేరగాళ్ల మోసానికి గురైనట్లు అనుమానం వస్తే, రికవరీ కోసం వేచి చూడకుండా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 కు లేదా మీ బ్యాంకులోని సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేయాలి. డిజిటల్ లావాదేవీలు ఎంత వేగవంతమో, అంత జాగ్రత్త కూడా అవసరం. పిన్ ఎంటర్ చేసే ముందు రిసీవర్ పేరు, యూపీఐ ఐడీని ఒక్కసారికి రెండుసార్లు సరిచూసుకోవడమే ఇటువంటి చిక్కుల నుంచి మనల్ని కాపాడుతుంది.














Click it and Unblock the Notifications