కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం(డిసెంబర్ 7) ఉదయం బాపులపాడు మండలం బొమ్ములూరు సమీపంలో... రోడ్డు పక్కన ఆగి వున్న లారీని ఓ కారు అతివేగంతో వెనుక నుంచి ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవడంతో మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి.
ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని క్రేన్ సహాయంతో మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా భీమవరంలో ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. మృతులను చీమకుర్తి నాగేశ్వరవు, తాతారావు, కనకదుర్గ రావులుగా గుర్తించిన పోలీసులు.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.