తెలంగాణలో బోటింగ్ బ్యాన్..??
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. అలాగే పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. విహారయాత్రకు ఎక్కడికైనా వెళ్లాలని చాలామంది ప్లాన్ వేస్తుంటారు. ఇక సమ్మర్ అలా హాయిగా బోట్ షికారు చేయాలని చాలామందికి ఉంటుంది. తెలంగాణలోనూ చాలా ప్రాంతాల్లో బోటింగ్ సౌకర్యం ఉంది. అయితే తాజాగా మధ్య ప్రదేశ్ లోని బార్గి రిజర్వాయల్ వద్ద నర్మదా నదిలో ఇటీవల జరిగిన ఘోర పడవ ప్రమాదం కారణంగా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలోని బోటింగ్ ప్రాంతాల్లో భద్రతపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని బోటింగ్ కేంద్రాలకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నూతన ఆదేశాలు జారీ చేసింది. ప్రతికూల వాతావరణంలో బోటింగ్ ను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. రూల్స్ ను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.
ఇటీవల మధ్యప్రదేశ్ జబల్ పూర్ జిల్లాలోని నర్మదా నదిపై ఉన్న బార్గి రిజర్వాయర్ వద్ద ఘోర పడవ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో 35 నుంచి 40 మంది పర్యటకులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు హృదయాల్ని కలచివేస్తున్నాయి. అయితే మధ్యప్రదేశ్ బోటు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. పర్యటకుల భద్రతే లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని బోటింగ్ కేంద్రాల్లో కఠినమైన రూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ. ఈ మేరకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.

వేసవి సెలవుల కారణంగా బోటింగ్ కేంద్రాలకు పర్యటకులు అధిక సంఖ్యలో రావడం సహజం. అయితే బోటింగ్ కేంద్రాల వద్ద నిర్వాహకులు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏ చిన్న పొరపాటు జరిగినా ఇన్ ఛార్జులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. పడవల్లో పరిమితికి మించి పర్యటకులను ఎక్కించడం, ప్రయాణికులకు లైఫ్ జాకెట్లను అందించకపోవడం వంటి ఉల్లంఘనలను ఏమాత్రం సహించేది లేదని పేర్కొంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పుడు బోటింగ్ సర్వీసులను తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.












Click it and Unblock the Notifications