NRI News: బ్యాంకుపై వినియోగదారుల కోర్టుకెళ్లిన ఎన్నారై.. చివరికి ఏం జరిగిందంటే..!
ఓ ఎన్నారైకి బ్యాంకు షాకిచ్చింది. బ్యాంకులో కోటి రూపాయల ఎఫ్డీ చేసిన అతనికి రూ.24 లక్షలు తక్కువ చెల్లించింది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో బ్యాంకు బాగోతం బయటపడింది. బ్యాంకు తప్పు చేసిన వినియోగదారుల కోర్టు నిర్ధారించింది. దీంతో ఖాతాదారుడికి చెల్లించాల్సిన రూ.24.31 లక్షలను 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఖర్చుల కింద రూ. 25 వేలు, మానసిక క్షోభ కలిగించినందుకు మరో రూ.10 వేలు చెల్లించాలని స్పష్టం చేసింది.
ఓ ఎన్నారై దిలీప్ పటేల్ జాంబియాలో నివసిస్తున్నాడు. 2012 మే 30న ఆయన తన వద్ద ఉన్న 1.14 కోట్లను బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐదేళ్ల కాలపరిమితిపై ఫిక్సడ్ డిపాజిట్ చేశాడు. ఆ తరువాత ఆటోమేటిక్గా ఎఫ్డీ రెన్యూ అయ్యేలా బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నాడు. ఎఫ్డీపై 6.75 శాతం వడ్డీ చెల్లించేలా ఒప్పందంలో ఉంది. ఈ క్రమంలో 2017లో ఎఫ్డీ మరోసారి రెన్యూవల్ అయింది. ఈ లెక్కన ఆయనకు 2022 మే 30 నాటికి మొత్తం రూ.2.42 కోట్లు రావాల్సి ఉంది.2018లో ఓ మారు పటేల్ తన బ్యాంకు వివరాలు చెక్ చేయగా బ్యాంకు తన వడ్డీ రేటులో కోత పెట్టినట్టు దిలీప్ పటేల్ గుర్తించాడు.

వెంటనే బ్యాంకును ఈ విషయమై వివరణ కోరుతూ బ్యాంకుకు మెయిల్ పంపాడు. 6.75 వడ్డీ చెల్లించేందుకు తమ మధ్య ఒప్పందాన్ని మెయిల్ లో ప్రస్తావించాడు. 2022 నవంబర్ ఎఫ్డీ అకౌంట్ క్లోజ్ చేశాడు. అయితే అతనికి బ్యాంకు రూ.2.18 కోట్లు మాత్రమే చెల్లించింది. కానీ అతనికి రావాల్సింది రూ.2.42 కోట్లు. ఈ విషయమై బ్యాంకు అధికారులతో పటేల్ పలుమార్లు చర్చించారు. పరిష్కరం లభించకపోవడంతో వినియోగదారుల కోర్టుకు వెళ్లాడు. తనకు చెల్లించాల్సిన రూ.24 లక్షల వడ్డీని ఇప్పించాలని కోర్టును కోరాడు.
దీనితోపాటూ తనకు మానసిక వేదన కలిగించినందుకు రూ.7 లక్షలు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.3 లక్షలు బ్యాంకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పటేల్ వినియోగదారుల కోర్టుకు అన్ని పత్రాలు దాఖలు చేశాడు. దీంతో బ్యాంకు ఖాతాదారుడితో సరిగా వ్యవహరించలేదని అభిప్రాయపడింది. బాకీ పడ్డ మొత్తాన్ని బాధితుడికి వడ్డీతో సహా చెల్లించాలని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications