పాకిస్థాన్ ఆర్మీకి భారీగా జీతాలు పెంపు.. భారత్ పై బాగా పోరాడినందుకట..!
జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో గతేడాది ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలడంతో.. పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ భయం ఇంకా పాకిస్థాన్ ఆర్మీ గుండెల్లో అలాగే ఉంది.
భారత్ చేపట్టిన'ఆపరేషన్ సిందూర్' ఘోర పరాజయం తర్వాత కుదేలైన పాకిస్థాన్ సైన్యంలో నైతిక స్థైర్యాన్ని నింపేందుకు ఆ దేశ సాయుధ దళాలు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, సైనికులు, అధికారుల జీతాలను దాదాపు 25 శాతం వరకు పెంచుతూ పాకిస్థాన్ సైన్యానికి చెందిన కీలక విభాగాలు నిర్ణయించాయి. దీనికి పాక్ జీబీ సైనిక ఉన్నతాధికారులు ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఇంటెలిజెన్స్ సైనిక వర్గాల సమాచారం ప్రకారం, కొత్తగా సవరించిన పరిహార ప్యాకేజీలో భాగంగా తాత్కాలిక ఉపశమన భత్యాన్ని (అడ్హాక్ రిలీఫ్ అలవెన్స్) 25 శాతం పెంచారు. అలాగే సైనికులకు ఇచ్చే డిస్టర్బెన్స్ అలవెన్స్ను ఏకంగా మూడు రెట్లు పెంచినట్లు తెలుస్తోంది. దీనితో పాటు యూనిఫాం అలవెన్స్, క్యాష్-ఇన్-ల్యూ బెనిఫిట్, బ్యాట్ మ్యాన్ అలవెన్స్ లను కూడా రెట్టింపు చేశారు. ఈ పెరిగిన జీతాల నూతన విధానం అన్ని క్యాడర్ల అధికారులకు, కింది స్థాయి సిబ్బందికి తక్షణమే వర్తించనుంది.
ఆపరేషన్ సింధూర్ ప్రభావం..
కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు మే 2025లో సైనిక చర్యను చేపట్టాయి. 'ఆపరేషన్ సింధూర్' పేరుతో జరిగిన ఈ దాడిలో పాకిస్థాన్ కు చెందిన పలు కీలక సైనిక స్థావరాలు భారీగా ధ్వంసం అయ్యాయి. ఈ చర్యతో సరిహద్దుల్లో భారీ నష్టాన్ని చవిచూసిన పాక్ సైన్యంలో తీవ్ర నైరాశ్యం ఆవరించింది. ఆ సైనికుల మానసిక ధైర్యాన్ని తిరిగి పుంజుకునేలా చేయడం, వారి యుద్ధ సంసిద్ధతను పెంపొందించడమే లక్ష్యంగా పాక్ ఈ నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక లోటు, ద్రవ్యోల్బణ ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. దేశ ప్రజలకు కనీస వసతులు కల్పించలేని స్థితిలో ఉన్నప్పటికీ, రక్షణ రంగానికి భారీగా బడ్జెట్ కేటాయించడం గమనార్హం. రక్షణ వ్యయం విపరీతంగా పెరగనున్నప్పటికీ, బలగాల జీతాలకే పాక్ అగ్ర ప్రాధాన్యత ఇస్తోంది. దీని వెనుక భారత్తో ఉన్న సరిహద్దు పరమైన భయాందోళనలు, సైన్యంలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చే వ్యూహాలు దాగి ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పరిణామాల నడుమ ఇటీవలే జనరల్ అసిమ్ మునీర్ ను ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి కల్పించడం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తించింది. పాక్ చరిత్రలో అయూబ్ ఖాన్ తర్వాత ఈ ఐదు నక్షత్రాల అత్యున్నత స్థాయిని అందుకున్న రెండో అధికారి మునీర్ కావడం విశేషం. యుద్ధ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ, బలగాల నైతిక స్థైర్యాన్ని కాపాడేందుకే పాకిస్థాన్ సైనిక నాయకత్వం ఈ తక్షణ జీతాల సవరణ నిర్ణయాలను వేగంగా అమలు చేస్తోంది.












Click it and Unblock the Notifications