ఇరాన్కు బిగ్ షాక్: హార్ముజ్పై ట్రంప్ సంచలన ప్రకటన!
ఇరాన్తో సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఆ దేశాన్ని పూర్తిగా ఓడించిన అనంతరం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన 'హార్ముజ్ జలసంధి' మార్గాన్ని త్వరలోనే అమెరికా భూభాగంగా ప్రకటించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కామెంట్స్ అంతర్జాతీయంగా చర్చలకు దారితీశాయి.
న్యూయార్క్ స్టేట్లోని గార్డెన్ సిటీలో ఉన్న ఓ పోలీస్ అకాడమీలో జరిగిన మద్దతుదారుల సమావేశంలో ప్రసంగిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. "ప్రస్తుతం ఇరాన్ తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశంపై విజయం పూర్తయిన వెంటనే హార్ముజ్ జలసంధిని యునైటెడ్ స్టేట్స్ సొంత భూభాగంగా నేను ప్రకటిస్తానని ట్రంప్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్త ఇంధన, ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) రవాణాలో ఐదో వంతుకు పైగా ఈ సముద్ర మార్గం గుండానే సాగుతుంది. అయితే ఇరాన్ తన ఆధిక్యతను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో అమెరికా నౌకాదళం అక్కడ కట్టుదిట్టమైన ఉక్కు గోడ వంటి దిగ్బంధనాన్ని అమలు చేస్తోందని డొనాల్డ్ ట్రంప్ వివరించారు. అమెరికా నౌకాదళం అనుమతించిన నౌకలు మాత్రమే అక్కడ ప్రయాణించగలవని వెల్లడించారు.
ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకోవడం, ఆర్థిక ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనం ద్వారా ఆ దేశ సైనిక బలాలను దెబ్బతీయడం తమ లక్ష్యమని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అంతర్జాతీయ భద్రత కోసం తమ ప్రభుత్వం సరైన నిర్ణయాలే తీసుకుంటోందని.. ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ఇరాన్ వెంటనే తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ద్వారా లేదా ప్రసంగాల ద్వారా హార్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకోలేరని.. ఆ వ్యూహాత్మక జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications