వారి ట్రాప్ లో పడొద్దు, పరిధి దాటొద్దు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికలకు కూటమి.. వైసీపీ సమాయత్తం అవుతున్నాయి. ఒంగోలు కేంద్రంగా తాజాగా చోటు చేసుకున్న పరిణామాల వేళ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టింగ్స్ దర్శనమిస్తున్నాయి. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. పార్టీ శ్రేణులకు కీలక దిశా నిర్దేశం చేసారు. జనసైనికులను రెచ్చగొట్టే వ్యాఖ్యల వేళ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారింది. కూటమి - వైసీపీ మధ్య హోరా హోరీగా సోషల్ మీడియా వేదికగా రాజకీయం కొనసాగుతోంది. ఒంగోలులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల వేళ కొన్ని ఆసక్తి కర పోస్టింగ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో జనసైనికులు పరిధికి లోబడి వ్యవహరించాలని నిర్దేశించారు. సోషల్ మీడియా వేదికగా విభిన్నమైన విషయాలు మాట్లాడేటప్పుడు, పోస్టులు చేసేటప్పుడు జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. వాడే భాష, భావ వ్యక్తీకరణలో పరిధి దాటొద్దని ఆదేశించారు. అనవసర విషయాలపై ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని స్పష్టం చేశారని ఆ పార్టీ కార్యాలయం ప్రకటనలో తెలిపింది. 'ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో మాట్లాడే సమయంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు కచ్చితంగా పార్టీ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని నిర్దేశించారు.

జనసైనికులకు మార్గ నిర్దేశం
అదే విధంగా వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లవద్దని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే స్పందించాలి, ఏదైనా విషయంపై మాట్లాడే సమయంలో ఆవేశాలకు లోను కావద్దు. అసభ్య పదజాలం వాడవద్దు. మహిళలను గౌరవించి మాట్లాడాలి. పార్టీ అంతర్గత అంశాలపై సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం మాట్లాడొద్దు. పార్టీ భావజాలాన్ని కించపరిచేలా మాట్లాడే వారిని ఉపేక్షించొద్దు. పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించేలా, జనసైనికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే వారిపై జాగ్రత్తగా ఉండాలి. వారి ప్రభావానికి లోనుకావొద్దు. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా మాట్లాడాలి. రాజకీయ శత్రువుల సోషల్ మీడియా ప్రచార వలలో పడొద్దు. పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలను, రకరకాల విషప్రచారాలను తిప్పికొట్టాలని పవన్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications