యూఎస్, యూకే, కెనడా వద్దు.. ఈ దేశాలే ముద్దు- భారతీయ విద్యార్ధుల పరుగులు..!
అంతర్జాతీయంగా మారుతున్న పరిస్దితులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకుంటున్న భారతీయ విద్యార్ధుల్ని ఆలోచనలో పడేస్తున్నాయి. ముఖ్యంగా ఇన్నాళ్లు సురక్షితంగా భావించిన అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో భారతీయులపై పెరుగుతున్న దాడులతో వారి ఆలోచనా ధోరణిలో మార్పు కనిపిస్తోంది. ఈ దేశాల్ని కాదని యూరప్ లోని ఇతర దేశాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ ప్రభావం ఆయా దేశాలపైనా పడుతోంది.
విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్దుల సంఖ్య ప్రస్తుతం 13.2 లక్షలుగా ఉందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో అంచనా వేసింది. ఇందులో 4.6 లక్షల మంది అమెరికాలోనే ఉన్నారు. కెనడాలో 1.83 లక్షల మంది ఉన్నారు. ఆ తర్వాత స్ధానంలో బ్రిటన్ కూడా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో అమెరికా, బ్రిటన్, కెనడాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. ఇందులోనూ విద్యార్ధులపై దాడులు ఎక్కువవుతున్నాయి. దీంతో భారత్ లో ఉన్న వారి తల్లితండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, కెనడాల్ని కాదని యూరప్ తో పాటు ఇతర దేశాలకు వెళ్లేందుకు తాజాగా విద్యార్ధులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇలా మన విద్యార్ధులు ఎంచుకుంటున్న ఇతర దేశాల్లో జర్మనీ, పోలండ్, నెదర్లాండ్స్, బెల్జియం, న్యూజీలాండ్, హంగరీ వంటి దేశాలున్నాయి. మన విద్యార్దులు ఉన్నత విద్యాభ్యాసం కోసం ఈ దేశాల్ని ఇప్పుడు ప్రత్యామ్నాయాలుగా ఎంచుకుంటున్నట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
జర్మనీనే చూసుకుంటే 423 ఉన్నత విద్యాసంస్ధలుంటే ..ఇందులో 42 వేల మందికి పైగా భారతీయ విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. నెదర్లాండ్స్ లో 30 యూనివర్శిటీలు ఉంటే ఇందులో 3500 మంది మన విద్యార్ధులు చదువుకుంటున్నారు. పోలండ్ లోనూ 457 యూనివర్శిటీలు ఉంటే ఇందులో 2500 మంది భారతీయ విద్యార్ధులున్నారు. హంగరీలో వెయ్యి మంది, బెల్జియంలో 24 వేల మంది, న్యూజీలాండ్ లో15 వేల మంది మన వాళ్లు చదువుకుంటున్నారు.












Click it and Unblock the Notifications