నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం!
టాలీవుడ్ ప్రముఖ నటుడు, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ రాహుల్ రామకృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు అత్యంత ప్రమాదకరమైన 'పారాక్వాట్' అనే విషపూరిత పురుగుల మందు కారణంగా తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను స్వయంగా రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ కీలక విజ్ఞప్తి చేశాడు. తన సోదరుడి మరణ వార్తను ఆవేదనతో పంచుకుంటూనే.. వ్యవసాయంలో కలుపు మొక్కలను నివారించడానికి వాడే 'పారాక్వాట్' అనే పురుగుల మందు తన సోదరుడి ప్రాణాలు తీసిందని ఆయన పేర్కొన్నారు. ఈ విషం శరీరంలోకి వెళ్తే ప్రాణాలు కాపాడటం దాదాపు అసాధ్యమని.. వైద్యుల దగ్గరకు ఇలాంటి కేసులు భారీగా వస్తున్నాయని రాహుల్ రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే తన సోదరుడు ఈ విషం బారిన ఎలా పడ్డారనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిలకు విజ్ఞప్తి
ఈ ప్రమాదకరమైన పురుగుల మందు మార్కెట్లో ఇంత సులభంగా దొరకడంపై రాహుల్ రామకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ మేరకు రాహుల్ రామకృష్ణ ఎక్స్ ఖాతా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. "ఈ రోజు నేను నా సోదరుడిని పారాక్వాట్ విషం వల్ల కోల్పోయాను. ఇది అత్యంత ప్రాణాంతకమైనది. ఆత్మహత్యల కోసం దీనిని విరివిగా దుర్వినియోగం చేస్తున్నారు. ఇది మార్కెట్లో ఇంత సులభంగా ఎలా దొరుకుతుందో చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. దయచేసి దీనిపై వెంటనే నిషేధం విధించి, ప్రజల ప్రాణాలను కాపాడండి" అని రాహుల్ రామకృష్ణ వేడుకున్నాడు.

ఏమిటి ఈ పారాక్వాట్ విషం?
పారాక్వాట్ అనేది వ్యవసాయంలో వాడే అత్యంత శక్తివంతమైన కలుపు సంహారిణి. దీనికి విరుగుడు అనేది ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇది శరీరంలోకి వెళ్తే ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం వంటి కీలక అవయవాలను వేగంగా దెబ్బతీస్తుంది. దీని తీవ్రత దృష్ట్యా ఇప్పటికే అనేక దేశాల్లో దీనిపై నిషేధం ఉంది. మన దేశంలో కూడా పారాక్వాట్ వినియోగంపై పరిమితులు విధించాలని నిపుణులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.
Honourable Sirs @TelanganaCMO @PMOIndia,
— Rahul Ramakrishna (@eyrahul) March 26, 2026
Lost my brother today to Paraquat poisoning. It’s terrifyingly lethal and widely misused for self-destruction. Shocked by how easily it is available everywhere. Doctors are overwhelmed by the amount of cases.Please ban it ASAP-save lives🙏🏽
రాహుల్ రామకృష్ణ కెరీర్
జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి 'సైన్మా' అనే షార్ట్ ఫిలింతో నటుడిగా మారిన రాహుల్ రామకృష్ణకు 'అర్జున్ రెడ్డి' చిత్రంతో భారీ బ్రేక్ లభించింది. ఆ తర్వాత 'భరత్ అనే నేను', 'గీత గోవిందం', 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన 'ఆంధ్ర కింగ్ తాలూకా' (2025) సినిమాలో కనిపించాడు. . గతంలో తన వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలను కూడా ధైర్యంగా పంచుకుని వార్తల్లో నిలిచాడు. రాహుల్ రామకృష్ణ సోదరుడి మృతికి పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.












Click it and Unblock the Notifications