తన ఆలోచన వ్యక్తిగత జీవితంపై ప్రభావం: నాగచైతన్య
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇటీవలే రెండు సినిమాలు నిరాశ పరిచినప్పటికీ ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా తండేల్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మత్స్యకారుని నిజజీవిత కథతో దీన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా నిర్మాత అల్లు అరవింద్ ప్రణాళికలు రచిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవాలని నాగచైతన్య చూస్తున్నారు.
రేసింగ్ అంటే బాగా ఇష్టం
నాగచైతన్యకు సినిమాలతోపాటు రేసింగ్ అంటే చాలా ఇష్టం. ఇటీవలే హైదరాబాద్ రేసింగ్ జట్టును కూడా కొనుగోలు చేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య పలు విషయాలను వెల్లడించారు. చిన్నతనం నుంచి తనకు రేసింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. కొత్తది ద్విచక్ర వాహనం ఏది కనిపించినా వెంటనే నడిపేవాడినని, సినిమాల్లోకి రాకముందు ఓ స్పోర్ట్స్ కారు కొన్నానని, దానిపై షికార్లు చేసేవాడినని, అయితే పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఆ అలవాటు నెమ్మది నెమ్మదిగా మానుకున్నట్లు చెప్పారు.

స్నేహితులు వద్దని చెప్పారు
తనను నమ్ముకొని నిర్మాతలు కోట్లరూపాయలు పెట్టుబడిగా పెడుతుంటారని, అలాంటి కారు డ్రైవ్ చేసే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదానికి గురికావల్సి వస్తుందని, అంత వేగంతో స్పోర్ట్స్ కారు నడపొద్దని స్నేహితులు కూడా చెప్పడంతో వాటికి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. ఏమరుపాటుగా ఉంటే షూటింగ్ లకు అంతరాయం కలగడంతోపాటు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుందని, నిర్మాతల కోసం ఆలోచించాల్సి వచ్చిందని, గతంలో తన ఆలోచన ఎప్పుడూ వాటిపైనే ఉండేదని, ప్రస్తుతం కారు రేస్ అనే ఆలోచనే తనకు రావడంలేదన్నారు. అప్పుడప్పుడు రేసు కారు నడుపుతున్నానని, అయితే చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా నడుపుతున్నట్లు నాగచైతన్య తెలిపారు.












Click it and Unblock the Notifications