సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. రెండు కళ్లూ చాలట్లేదు: స్కైవాక్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమందికి చిరపరిచితం. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఈ రైల్వే స్టేషన్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మొత్తం 10 ప్లాట్ఫామ్స్, 11 ట్రాక్స్ ఉన్న స్టేషన్ నుంచి నిత్యం 180 రైళ్లు దేశం నలుమూలలకూ రాకపోకలు సాగిస్తోంటాయి. రోజూ సగటున లక్షన్నర మంది ప్రయాణికులు ఈ స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తుంటారు. దేశంలో అత్యధిక ఆదయాన్ని ఆర్జించే జోన్లల్లో ఒకటిగా ఉండే దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బిందువు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్టేషన్ పునర్నిర్మాణ పనులు సాగుతున్నాయి. 714.73 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పనులు ఇప్పటికే 65 శాతం పూర్తయ్యాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మల్టీమోడల్ కనెక్టివిటీతో ఈ స్టేషన్ను తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వీటి పురోగతిపై కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. 65 శాతం పనులు పూర్తయినట్లు వెల్లడించారు.

ప్రయాణికుల అత్యవసర అవసరాల కోసం తాత్కాలిక బుకింగ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.. స్టేషన్ ఆవరణలో. దీంతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భవనం, ఖాజీపేట వైపు నూతన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చాయి. స్టేషన్ దక్షిణ భాగంలో భారీ భవనం, దానికి అనుసంధానంగా ఉండే రోడ్లు, బేస్మెంట్ పనులు, ఇటు వైపు వచ్చే ప్రయాణికుల రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పటికే తుదిరూపాన్ని సంతరించుకుంది.
స్టేషన్ ఉత్తరం వైపు మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయం, భవన నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నాయి. రైళ్ల రాకపోకల పైభాగంలో నిర్మించే విశాలమైన రెండు అంతస్తుల ఎయిర్ కాంకార్స్ నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ప్లాట్ఫామ్లపై సరికొత్త పైకప్పుల ఏర్పాటుతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రగతిలో ఉంది. ప్రయాణికులు నడవడానికి వీలుగా ట్రావెలెటర్లతో కూడిన వంతెనల పనులు వేగంగా జరుగుతున్నాయి.

సికింద్రాబాద్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ నియంత్రించడానికి మొత్తం 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తోన్నారు. మెట్రో రైల్వే స్టేషన్తో నేరుగా కనెక్ట్ అయ్యేలా ప్రత్యేక స్కైవాక్ నిర్మాణం కొనసాగుతోంది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ స్టేషన్ ప్రాంగణంలో సోలార్ విద్యుత్ వ్యవస్థ, మురుగునీటి శుద్ధి ప్లాంట్ ను కూడా అభివృద్ధి చేస్తోన్నారు. పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవిష్యత్తులో తెలంగాణకు నూతన గేట్ వే గా నిలవనుంది. దేశంలోనే అతిపెద్ద, ఆధునిక రైల్వే హబ్లలో ఒకటిగా నిలిచే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులకు అత్యంత విలాసవంతంగా, ఎయిర్ పోర్ట్ స్థాయిలో ఉండే ప్రయాణ అనుభూతి లభించడం ఖాయం.












Click it and Unblock the Notifications