నిజ జీవితంలో 'పుష్ప2' పాత్ర నుంచి బయటకు రాని అల్లు అర్జున్?
పుష్ప2 సినిమాలో ముఖ్యమంత్రితో తన పెనిమిటి ఒక ఫొటో దిగితే చూడాలని భార్య కోరుకుంటుంది. దీంతో అల్లు అర్జున్ రష్మిక కోరిక తీర్చేందుకు రావు రమేష్ ను తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరకు వెళతాడు. అయితే స్మగ్లర్ తో ఫొటో దిగడం ఏమిటని ముఖ్యమంత్రి అవమానిస్తారు. దీంతో హీరో ఈగో హర్ట్ అవుతుంది. తర్వాత ముఖ్యమంత్రిని మార్చేసి రావు రమేష్ ను ఆ సీట్లో కూర్చోపెడతాడు. అంతవరకు బాగానేవుంది. ఎందుకంటే అది సినిమా కాబట్టి. కానీ సినిమా వేరు.. నిజ జీవితం వేరు. కొంతమంది నటులు సినిమాల్లోని తమ పాత్రల నుంచి చాలా సందర్భాల్లో బయటకు రావడం ఆలస్యం జరుగుతుంటుంది. ఎందుకంటే ఆ పాత్రల్లో అంతగా ఇమిడిపోతారు. సరిగ్గా అల్లు అర్జున్ విషయంలో కూడా ఇదే జరిగింది.
ఎందుకు ట్వీట్ చేయలేదు?
సినిమాలో కొన్ని డైలాగులు చిరంజీవి ఉద్దేశించి చెప్పినట్లుగా ఉన్నాయిని వార్తలు వచ్చాయి. కనీసం ఓ ట్వీట్ చేసి తానెందుకు చిరంజీవిని అవమానిస్తానని, ఆ డైలాగుకు, చిరంజీవికి సంబంధం లేదంటూ చెప్పివుంటే చాలా బాగుండేది. కానీ బన్నీ అలా చేయలేదు. వాటిని ఖండించే ప్రయత్నమే చేయలేదు. దీనికితోడు అల్లు అర్జున్ ఆర్మీ ఈ విషయంలో మరింత రెచ్చిపోయింది. జైలు నుంచి విడుదలైన తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్లి గంట సమయం గడిపారు. భోజనం అక్కడే చేశారు. కేసు నుంచి బయటపడవేయమని కోరివుంటాడని మెగా అభిమానులు అంటున్నారు. తర్వాత నాగబాబు ఇంటికి వెళ్లాడు. అయితే రామ్ చరణ్ మాత్రం ఎక్కడా కనపడలేదు.
వీరిద్దరిమధ్య బయటకు తెలియని తీవ్రమైన విభేదాలున్నాయని అర్థమవుతోంది.

లైవ్ టెలికాస్ట్ ఎందుకు?
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐకాన్ స్టార్ అనే పేరు ఉన్న టీ షర్ట్ ను అల్లు అర్జున్ ధరించాడు. అంతేకాదు.. లైవ్ టెలికాస్ట్ పెట్టారు. ఇవన్నీ అవసరమా? అని బన్నీ అభిమానులే ప్రశ్నిస్తున్నారు. ఓ పక్క శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. అప్పటివరకు కనీసం కలిసే ప్రయత్నమే చేయలేదు. తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండటంతో మూడు రోజుల క్రితం అతని తండ్రి అల్లు అరవింద్ వెళ్లి కలిసివచ్చాడు. తనవల్ల ఎవరైనా బాధపడినా, ఇబ్బందులు కలిగినా, ప్రాణాలు పోయినా వారిని కలిసి పరామర్శించి తానున్నానంటూ ధైర్యం చెప్పడం హీరో కనీస లక్షణం. కానీ ఆ లక్షణాలు అల్లు అర్జున్ లో మచ్చుకు కూడా కనపడలేదు.
ధైర్యం చెప్పిన హీరో సూర్య
ఏపీలోని నరసరావుపేట వద్ద తన సినిమా కోసం ఫ్లెక్సీ కడుతూ విద్యుత్తు షాక్ తో అభిమాని మరణిస్తే తమిళనాడు నుంచి మనుషులను పంపించడమే కాకుండా లైవ్ లో హీరో సూర్య మాట్లాడి వారికి ఆర్థిక సహాయం అందజేయడంతోపాటు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అదీ హీరో నిజమైన లక్షణం. టీవీ9 విలేకరిపై మోహన్ బాబు చేయిచేసుకోవడంతో తర్వాత ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వచ్చాడు. అందుకు ఏ చట్టం అతన్ని ఆపలేదు. మరి శ్రీతేజ్ ను పరామర్శించడానికి ఏ చట్టం ఆపుతుందో అతనికే తెలియాలి.












Click it and Unblock the Notifications