కరుడుగట్టిన విలన్.. 300 సినిమాల్లో యాక్టింగ్.. కానీ చివరి రోజుల్లో !
భారతీయ సినిమా తెరపై 80, 90 దశకాల్లో కరడుగట్టిన విలన్గా వెలుగొందారు " మహేష్ ఆనంద్ ". ఆయన శరీరాకృతి, భయపెట్టే గంభీర స్వరం.. విలన్ పాత్రలకు సరిగ్గా సరిపోతారు అనేలా ఉంటారు. అంతే కాకుండా మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్.. డ్యాన్సింగ్, మోడలింగ్ అంటూ పలు రంగాల్లో సత్తా చాటారు. దాదాపు 300 కి పైగా సినిమాల్లో నటించిన మహేష్.. సినిమా కెరీర్ పరంగా టాప్ లో ఉంటే.. పర్సనల్ లైఫ్ లో మాత్రం దీనావస్థ ఎదుర్కొని అనాథలాగా మృతి చెందడం అందరిలోనూ విషాదం నింపింది.
సినీ ప్రస్థానం..
మహేష్ ఆనంద్ తొలిసారి 1982లో 'సనమ్ తేరీ కసమ్' టైటిల్ సాంగ్లో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా కనిపించాడు. 1988లో అమితాబ్ బచ్చన్ నటించిన 'షహెన్షా'లో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత గంగా జమునా సరస్వతి, తూఫాన్, గుమ్రా, సస్తి దుల్హన్ మహాంగ్ దుల్హా, ఖుద్దార్, స్వర్గ్, వర్ధీ వంటి అనేక చిత్రాల్లో ప్రతినాయకుడిగా మెరిశాడు. 90వ దశకంలో ఏటా 6-8 సినిమాలు చేసిన మహేష్.. బాలీవుడ్లో స్టార్ హీరోల రేంజ్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. మొత్తం మీద 300కి పైగా హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు.

తెలుగు సినిమాల్లో కూడా..
హిందీతో పాటు తెలుగులో కూడా.. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. లంకేశ్వరుడు, ఎస్పీ పరశురామ్, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, అల్లుడా మజాకా, నెంబర్ వన్, బాలు వంటి చిత్రాల్లో మెప్పించారు.
వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు..
సినిమాల్లో విలన్గా విజయవంతమైనా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం మహేష్ ఆనంద్ తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నాడు. అతని పెళ్లిళ్లు వరుసగా విఫలమయ్యాయి. మొదట భారతి రాయ్ను పెళ్లి చేసుకున్నాడు, విడాకులిచ్చాడు. ఆ తరువాత 1987లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎరిక డిసౌజాను వివాహం చేసుకున్నాడు, కానీ అది కూడా ఎక్కువ కాలం నిలవలేదు.
అలానే 1992లో మధు మల్హోత్రాను వివాహం చేసుకున్నప్పటికీ అది కూడా కొంతకాలానికే ముగిసింది. తరువాత నటి ఉషా బచ్చనిని పెళ్లి చేసుకున్నాడు, కానీ రెండేళ్లకే విడిపోయాడు. చివరగా 2015లో రష్యన్ యువతి లనాను పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆమె కూడా విడిచిపెట్టింది. మొత్తంగా ఐదు పెళ్లిళ్లలో విఫలమై వ్యక్తిగతంగా కుంగిపోయాడు. 2000 తర్వాత సినిమాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి కూడా దూరమయ్యాడు.
విషాదాంతం..
ఇక ముంబైలోని తన ఫ్లాట్లో మహేష్ ఆనంద్ మృతదేహంగా కనబడటం సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. ఫిబ్రవరి 9, 2019న స్థానికులు యారి రోడ్లోని కినారా అపార్ట్మెంట్స్లోని అతని ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తోందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపు పగలగొట్టి లోనికి వెళ్ళగా, మహేశ్ ఆనంద్ శరీరం కుళ్లిపోయి కనిపించింది. పక్కనే సగం తాగిన మద్యం బాటిల్, బూజు పట్టిన భోజనపు ప్యాకెట్లు ఉన్నాయి.
పోస్ట్మార్టమ్లో అతనిది సహజ మరణమని తేలింది. కానీ చివరి రోజులు మహేశ్ ఎంత ఒంటరితనంతో గడిపాడో ఆ దృశ్యం చెబుతోంది. కుటుంబ సభ్యులు సైతం ముందుకు రాకపోవడంతో, అతని మృతదేహం ఆసుపత్రిలో చాలాకాలం ఉండిపోయింది. చివరికి రష్యాలో ఉన్న అతని భార్య లనానే వచ్చి అంత్యక్రియలు నిర్వహించింది.












Click it and Unblock the Notifications