నాగార్జున, మహేష్ బాబు ఆ పార్టీకి మద్దతా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13వ తేదీన జరగబోతున్నాయి. అదేరోజు లోక్ సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచార వ్యూహాల్లో నిమగ్నమై వున్నాయి. ప్రజల నాడి అర్థం కాకపోయినప్పటికీ ఏ పార్టీకా పార్టీ గుంభనంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల వాతావరణం తమకే అనుకూలంగా ఉందంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. అలాగే వ్యూహ ప్రతివ్యూహాల్లో భాగంగా సినీ పరిశ్రమకు చెందినవారిని కూడా భాగస్వాములను చేస్తున్నాయి.
నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న రోజా నగరి నియోజకవర్గంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పరిశ్రమలో పెద్దలుగా చెలామణి అవుతున్నవారికి మద్దతుగా ఉండేవారంతా ఈ ఎన్నికల్లో వారి వారి తరఫున ప్రచారం చేస్తున్నారు. ఎవరికివారు తమంతట తాముగా వచ్చి స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు.

అయితే రాజకీయ పార్టీలకు చెందిన సోషల్ మీడియా విభాగంద్వారా పరిశ్రమకు చెందిన ప్రముఖులు పలువురు తమ పార్టీకి ప్రచారం చేస్తున్నారని, మద్దతిస్తున్నారంటూ వార్తలను వైరల్ చేస్తున్నాయి. ఒక పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం నాగార్జునను కూడా వదిలిపెట్టలేదు. ఓ రాజకీయ పార్టీకి కింగ్ మద్దతిస్తున్నారంటూ వార్త చక్కర్లు కొట్టింది. అయితే అది తప్పుడు ప్రకటన అని సినీ ఆర్టిస్టుల సంఘం నుంచి సమాచారం అందింది. నాగార్జున అనే కాకుండా ప్రిన్స్ మహేష్ బాబు లాంటి స్టార్ ను కూడా పార్టీలు వాడేస్తున్నాయి. ఇలాంటివి నమ్మొద్దని అభిమానులు సైతం ప్రజలను వేడుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా తక్కువ సమయమే ఉండటంతో ఇటువంటి ఫేక్ ప్రకటనలు మరిన్ని వచ్చే అవకాశం ఉందని, వాటిపై ఎంతో జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications