ఇకపై అలాంటి పనులు చేయను - యాంకర్ శ్యామల
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆమెను దాదాపు రెండున్నర గంటలకు పైగా పోలీసులు విచారించారు. విచారణ ముగిసిన తర్వాత శ్యామల మీడియాతో ముచ్చటించారు. బెట్టింగ్ లకు పాల్పడటం, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం తప్పేనని శ్యామల వ్యాఖ్యానించారు.
అలానే తాను చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని శ్యామల తెలిపారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున విచారణ గురించి మాట్లాడటం సరికాదన్నారు. బాధ్యత గల పౌరురాలిగా బెట్టింగ్ ను ఇకపై ప్రమోట్ చేయనని స్పష్టం చేశారు. ఇకపై అలాంటి పనులకు దూరంగా ఉంటానని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రాణాలు కోల్పోయిన వారి లోటును ఎవరూ భర్తీ చేయలేరని.. వారి కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నానని వాపోయారు.

ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన కేసులో తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు శ్యామల. ఈరోజు పోలీసుల విచారణకు భయ్యా సన్నీ యాదవ్, సుధీర్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అంతే కాకుండా భయ్యా సన్నీ యాదవ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన నేడు విచారణ జరగనుంది.
ఇప్పటికే టీవీ యాంకర్ విష్ణు ప్రియ, రీతూ చౌదరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. యూట్యూబర్లు హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ లకు సైతం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయగా వారు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు. వీరి ఇరువురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు శ్యామలను ట్రోల్ చేస్తూ కూటమి నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications