వైభవంగా నాగచైతన్య-శోభిత పెళ్లి... వైరల్గా మారిన సమంత పోస్ట్
అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ వివాహం ఘనంగా జరిగింది. కేవలం 300 మంది అతిథుల మధ్యే నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య భావించడంతో హడావిడి లేకుండా నిరాడంబరంగా నాగార్జున వివాహాన్ని జరిపించారు. చిరంజీవి, కె.రాఘవేంద్రరావు, రామ్ చరణ్, అల్లు అరవింద్, అశ్వనీదత్, రాజమౌళి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శోభితను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని నాగార్జున ఫొటోలు షేర్ చేశారు. తమ జీవితాల్లో వీరిద్దరూ ఎంతో ఆనందాన్ని తెచ్చారని, అక్కినేని నాగేశ్వరరావు శతజయంతికి గుర్తుగా స్థాపించిన విగ్రహం వద్ద, ఆయన ఆశీర్వాదంతో ఈ పెళ్లి జరగడం మరింత సంతోషంగా ఉందన్నారు.
వీడియో షేర్ చేసిన సమంత
నాగచైతన్యకు వివాహం జరగడంతో సమంత ఏం చేస్తుందని అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. కొత్త జంటకు ఏమైనా విషెస్ చెబుతుందా? అని నెటిజన్లు ఎదురుచూస్తున్నారు. తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఫైట్ లైక్ ఏ గర్ల్ అనే ట్యాగ్తో ఓ వీడియోను ఇన్స్టా స్టోరీస్లో సమంత పోస్ట్ చేసింది. సమంత ఎంతో స్ఫూర్తివంతమైన వీడియోలను తరుచుగా ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా అలాంటిదే మరో వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ఆ వీడియో ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే కుస్తీ పోటీ.

ఈ అమ్మాయిలా అందరూ పోరాడండి
వీడియో ప్రారంభంలో అబ్బాయి ఎంతో పట్టుదలగా అమ్మాయితో పోరాడుతుంటాడు. చూసినవారంతా అతడే గెలుస్తాడని భావిస్తారు. అయితే పోటీ ముగిసే సమయం దగ్గర పడేకొద్దీ అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతిని అమ్మాయి చేతిలో ఓటమిపాలవుతాడు. ఫైట్ లైక్ ఏ గర్ల్ అని క్యాప్షన్ పెట్టింది. ఈ అమ్మాయిలాగా పోరాడండి అనేది దీని అర్థం. ప్రస్తుతం నాగచైతన్య - శోభిత పెళ్లిరోజే దీన్ని సమంత పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరలైంది. అభిమానులు దీనిపై చర్చించుకుంటున్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మయోసైటిస్ కు గురైంది. దీనికోసం చికిత్స తీసుకుంది. ఈలోగా ఏడాదిన్నరపాటు సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు రావడంలేదని బహిరంగంగానే చెప్పింది.












Click it and Unblock the Notifications