PM Modi 8pm: జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారా?: ఛానళ్ల ముందుకు రానున్నారా? నిజమేంటీ
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశం మరోసారి లాక్డౌన్లో వెళ్లబోతోందా? గత ఏడాది మార్చిలో కరోనా వైరస్ ఎలాంటి పరిస్థితులను సృష్టించిందో.. సరిగ్గా అదే సమయానికి అవే తరహా వాతావరణం దేశంలో నెలకొన్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారా? ఇదివరకట్లా రాత్రి 8 గంటలకు ఆయన టీవీ ఛానళ్ల ముందుకు రానున్నారా? మళ్లీ లాక్డౌన్ విధించేలా ఏదైనా ప్రకటన చేస్తారా?.. ప్రస్తుతం సోషల్ మీడియా, వాట్సప్ ఛాట్స్లో భారీ ఎత్తున సెర్చింగ్, సర్కులేట్ అవుతున్న ఉన్న ప్రశ్నలివి.
ఆ సమాచారం పూర్తిగా అవాస్తవం. వాట్సప్ ఛాట్స్లో సర్కులేట్ అవుతోన్న ఈ వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. ప్రధాని మోడీ.. జాతిని ఉద్దేశించి ప్రసంగించట్లేదు. లాక్డౌన్పై ఎలాంటి ప్రకటనా చేయబోవట్లేదు. ప్రస్తుతం ఆయన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. తీరిక లేకుండా గడుపుతున్నారు. బుధవారం నాడాయన అస్సాం, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. బెంగాల్లోని కథి, అస్సాంలోని బిహుపూర్, సిపఝర్లల్లో ఎన్నికల సభల్లో ఉన్నారు.
తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో ఆయన వరుస బహిరంగ సభలను నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన రాత్రి 8గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా కేసుల తీవ్రతను బట్టి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా వైరస్ కట్టడి కోసం సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపింది.
కరోనా వైరస్ కేసుల తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధించేలా చర్యలు తీసుకోవచ్చంటూ ఆదేశాలను ఇచ్చింది. దీనితో గత ఏడాది తరహాలో ప్రధాని టీవీ ఛానళ్ల ముందుకు వచ్చి లాక్డౌన్ను విధించేలా ప్రకటన చేస్తారంటూ వస్తోన్న వార్తలు అర్థరహితమని చెబుతున్నారు. అంతర్రాష్ట్రాల మధ్య రాకపోకలపై గానీ, ప్రజా రవాణా వ్యవస్థ లేదా సరుకుల రవాణాపై ఎలాంటి ఆంక్షలను విధించట్లేదు. రాష్ట్రాలు మాత్రం కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాకపోకలపై నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొంది.
Fact Check
వాదన
రాత్రి ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు
వాస్తవం
రాత్రి ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం లేదు