అమెరికాకు 'ట్రూ ఫ్రెండ్' పాకిస్థానే.. ఎట్టకేలకు బయటపడ్డ అమెరికా నిజస్వరూరం..!
అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో శాంతిని నెలకొల్పిన ఘనత డొనాల్డ్ ట్రంప్ కు దక్కుతుందని అన్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్లతో " నిజమైన స్నేహం" అభివృద్ధి చెందుతోందని ఆయన తాజాగా సింగపూర్ లో పేర్కొన్నారు.
సింగపూర్ లో జరిగిన షాంగ్రి-లా డైలాగ్ లో హెగ్సెత్ మాట్లాడుతూ.. గత సంవత్సరం సైనిక ఘర్షణ అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఏర్పడిన అవగాహనను ప్రస్తావించారు. ఉద్రిక్తతలను తగ్గించడంలో ట్రంప్ పోషించిన పాత్రను ప్రశంసించారు. "రెండు అణ్వాయుధ సామర్థ్యం గల దేశాలైన భారత్-పాకిస్థాన్ ల మధ్య శాంతిని నెలకొల్పడంలో అధ్యక్షుడి సామర్థ్యం మీరు చూశారు" అని హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గతేడాది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో 26 మంది మృతికి కారణమైన ఉగ్రదాడి తర్వాత.. తాను భారత్-పాకిస్థాన్ ల మధ్య నాలుగు రోజుల సైనిక ఘర్షణ అనంతరం శాంతిని నెలకొల్పానని ట్రంప్ పదేపదే ప్రకటించారు. అయితే.. భారత్ మాత్రం ఈ అవగాహన రెండు దేశాల మధ్యనే నేరుగా కుదిరిందని.. అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఖండించిన విషయం తెలిసిందే. ఇక హెగ్సెత్.. భారత్ ను అమెరికా ఇండో-పసిఫిక్ వ్యూహంలో కీలక భాగస్వామిగా అభివర్ణించారు, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని హైలైట్ చేశారు.
భారత్, పాకిస్తాన్ లు భద్రతాపరమైన ఆందోళనల దృష్ట్యా ఒకరినొకరు కనిపెట్టుకుంటూనే ఉంటాయని హెగ్సెత్ పేర్కొన్నారు. "భారత్, పాకిస్థాన్ రెండూ ఒకరి నుంచి మరొకరు బెదిరింపులను చూస్తాయని నేను భావిస్తున్నాను. బహుశా కొన్నింటిని మనం భిన్నంగా చూస్తున్నా, దేశాలు ICBM (అంతర్ఖండాల బాలిస్టిక్ క్షిపణి) బెదిరింపులను అభివృద్ధి చేయాలనుకుంటాయి" అని ఆయన అన్నారు.
"కానీ ప్రస్తుతం మా దృక్కోణం నుంచి, మేము ఏ దేశాన్ని వేలెత్తి చూపడం లేదు. వాటిని మాకు ముప్పుగా భావించడం లేదు" అని ఆయన వివరించారు. అంతర్జాతీయ స్థిరత్వానికి భారత్, పాకిస్థాన్ చేసిన కృషిని హెగ్సెత్ ప్రశంసించారు. "ప్రపంచవ్యాప్తంగా శాంతికి వారు అందించిన ప్రయోజనాలకు మేము కృతజ్ఞులం" అని ఆయన తెలిపారు. ప్రాంతీయ పరిణామాలను చర్చిస్తూ పాకిస్థాన్ సైనిక, రాజకీయ నాయకత్వాన్ని ఉద్దేశించి "నేను ఇక్కడ భారత్ ను ప్రస్తావించాను.. కానీ పాకిస్థాన్ ను.. ఫీల్డ్ మార్షల్, ప్రధానమంత్రి శాంతి చర్చల్లో పోషిస్తున్న పాత్రను కూడా నేను సులభంగా ప్రస్తావించగలిగేవాడిని. అనుకోని పరిణామం.. నిజమైన స్నేహం అక్కడ అభివృద్ధి చెందుతోంది. ఇది ముఖ్యమని నేను భావిస్తున్నాను" అని హెగ్సెత్ వ్యాఖ్యానించారు.
మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదుర్చడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో అమెరికా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత నెలలో ఇస్లామాబాద్ లో జరిగిన ఇరుపక్షాల ఉన్నత అధికారుల శాంతి చర్చలు ఒప్పందాన్ని కుదర్చడంలో విఫలం అయ్యాయి. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ త్వరలో తదుపరి శాంతి చర్చలకు ఆతిథ్యం ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సింగపూర్ సదస్సులో ఒక ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భారత్ పెరుగుతున్న సైనిక, పారిశ్రామిక సామర్థ్యాలపై కూడా హెగ్సెత్ మాట్లాడారు.

ఇండో-పసిఫిక్లో భారత్ ఒక ముఖ్యమైన భద్రతా భాగస్వామిగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత సాయుధ బలగాలు ఆధునీకరిస్తున్నాయని.. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో అధికార సమతుల్యతను నిలబెట్టడానికి సహాయపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అధిక స్థాయి సైనిక కార్యకలాపాలను కొనసాగించడానికి భారత్ పారిశ్రామిక, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచుకుంటుందని ఆయన తెలిపారు. "సామర్థ్యాలను పెంపొందించడానికి భారత్ తో సహ-ఉత్పత్తిని కొనసాగించడానికి కూడా మేము కట్టుబడి ఉన్నాము" అని హెగ్సెత్ పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications