Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యాంత్రీకరణ‍: ఉత్పాదకతకు ఊతం.. ఉపాధికి గండి

d paparao
మన దేశంలో ప్రజల ఉపాధి అవకాశాలు, రాను రాను మరింతగా కుదించుకుపోతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోతోంది. స్థూలంగా నేడు ప్రపంచ వ్యాప్త పరిణామం అయిన ‘ఉపాధి రహిత అభివృద్ధి' అనేది, మన దేశీయ ఉపాధి కల్పనను కూడా దెబ్బతీసింది. 2009-10లో జరిగిన (5 సంవత్సరాలకు ఒకమారు జరిగే) సర్వే ప్రకారంగా-దేశంలో ఉపాధి కల్పన భారీగా క్షీణించింది. ఈ మేరకు 2011లో విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారంగా, 2004-05, నుంచి, 2009-10(5 సంవత్సరాల కాలం) వరకూ కేవలం 27 లక్షల నూతన ఉపాధి అవకాశాలను మాత్రమే-మన ఆర్థిక వ్యవస్థ కల్పించగలిగింది. కాగా, ఈ సంఖ్య అంతకు ముందరి 5 సంవత్సరాల కాలంలో, దేశంలో కల్పించిన ఉపాధి స్థాయి అయిన 6 కోట్ల ఉపాధి అవకాశాల కంటే కూడా బహు స్వల్పం.

అయితే, ఈ సర్వే ఫలితాలను విశ్వసించని యూపిఏ పాలకులు-మరో ప్రత్యేక సర్వే జరిపించారు. అయితే, ఈ ప్రత్యేక సర్వే ఫలితాలు-తొలి సర్వే కంటే మరింత దారుణంగా ఉండడం గమనార్హం. 2011-12లో ఉపాధి కల్పన రేటు, దేశీయ స్థూల జాతీయ ఉత్పత్తి రేటుతోపాటుగా భారీగా పడిపోయిందని నూతన గణాంకాలు వెల్లడించాయి. మించి, 2009-10 నుంచి 2011-12 మధ్యన గడిచిన (రెండు సర్వేల నడుమన) 2 సంవత్సరాల కాలం-మనదేశంలో నిరుద్యోగం 10.2శాతం పెరిగిపోయింది. 2009-10లోని 39.2శాతం నుంచి ఉపాధి కల్పన రేటు అనేది, 2011-12లో 38.6శాతానికి పడిపోయింది. 2004-05లో యూపిఏ-1 తొలిసారిగా అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో ఈ ఉపాధి కల్పనా రేటు 42శాతంగా ఉంది. ఇదీ విషయం. దేశంలో జరుగుతున్న ఉపాధి రహిత ‘అభివృద్ధి' తాలూకు కథ ఇది!!! మరి, దీనంతటికీ కారణం ఏమిటి?

ప్రపంచ వ్యాప్తంగా, దరిదాపుగా అన్ని దేశాలలోనూ కొనసాగుతున్న ‘ఉపాధి రహిత అభివృద్ధి' అనేది, దీనంతటి వెనుకన ఉందని ముందుగానే చూశాం. అయితే, ఈ మాటలకు అర్థం ఏమిటి? దీని సారం సరళం! ఒక పక్క ప్రపంచంలోని వివిధ దేశాలలో పారిశ్రామిక, సేవా రంగాలలో కార్మిక, ఉద్యోగ ఉత్పాదకత పెరిగి-వృద్ధి తాలూకు ఆర్థిక గణాంకాలు బలంగా ఉన్నాయి. కానీ, మరో పక్కన- ఈ ఉత్పాదకత పెరుగుదలకు కారణం అయిన-సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి వలన-కోట్లాదిగా ప్రజలు నిరుద్యోగ సైన్యంలోకి నెట్టివేయబడుతున్నారు. దీంతో, మొత్తంగా ప్రపంచ మార్కెట్ ఆర్థిక వ్యవస్థలలో ప్రజల కొనుగోలు శక్తి-భారీగా దెబ్బతింటోంది. దీని ఫలితంగా, మార్కెట్లో వివిధ సరుకులు, సేవలకు డిమాండ్ పడిపోతోంది. ఈ కారణం చేత, ఆర్థిక మాంద్య పరిస్థితులు రోజు రోజుకూ మరింత జఠిలమవుతున్నాయి. ఈ సమస్యను నూతన ఉపాధి కల్పన ద్వారా అధిగమించలేని, వివిధ మార్కెట్ వ్యవస్థల దేశాలు తమ తమ వ్యవస్థలలో కరెన్సీ చలామణీని పెంచే (ఉద్దీపన పథకాలు) పనిలో పడ్డాయి.

తద్వారా అది ప్రజల కొనుగోలు శక్తినీ-సరుకుల డిమాండ్‌ను నిలబెట్ట చూస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది కూడా ఇదే. అక్కడి, పాలకులు-ప్రజల కొనుగోలు శక్తికి ఆసరాను ఇచ్చేందుకై-నెలవారీ $ 85 బిలియన్లను బాండ్ల కొనుగోలు రూపంలో ఆర్థిక వ్యవస్థలోకి-ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రకారంలోనే, ప్రజల కొనుగోలు శక్తి కాస్తంత మెరుగుపడి, నిరుద్యోగం కొంత ఉపశమించి, నేడు అమెరికాలోని ఆర్థిక గణాంకాలు సానుకూలతను చూపుతున్నాయి. దాంతో; నేడు నెలవారీ ఈ ఉద్దీపనను కొంత తగ్గించాలన్న ఆలోచనలు నడుస్తున్నాయి. కానీ, నిజానికి -ఈ ఉద్దీపనను కుదిస్తే అమెరికా మార్కెట్ లోని సమస్యలైన-ప్రజల కొనుగోలు శక్తీ, నిరుద్యోగం మరలా తిరిగి విజృంభించడం అనివార్యం!!! అదీ కథ.

ఇక, సాంకేతిక పరంగా అమెరికా అంతటి స్థాయి లేకున్నా, మనదేశంలోనూ నేడు పారిశ్రామిక వృద్ధినీ, ఉపాధి కల్పనను-నూతన యంత్రాలు, ఆటోమేషన్(యాంత్రీకరణ)లు తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. దీంతో, కాలం గడిచిన కొద్దీ- మనదేశంలో ఉపాధి కల్పన రేట్లు మరితంగా పతనం అవుతున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది. దీనికి ఉదాహరణలు కోకోల్లలు- 2003-04 నాటికే మనదేశంలోని కార్పొరేట్ల అయిన తాతాలకు-రెండు రకాల ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పాత సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే-హాట్ ఐరన్ కర్మాగారం. దానిలో, నాడు సుమారుగా 24,000మంది కార్మికులు ఉన్నారు. కాగా, రెండవది ఆధునిక ఆటోమేటెడ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఉక్కును ఉత్పత్తి చేసే కోల్డ్ ఐరన్ కర్మాగారం. నాటి గణాంకాల ప్రకారంగా ఈ రెండవ తరహా కర్మాగారంలో పనిచేస్తోంది కేవలం 144 మంది మాత్రమే. అదీ విషయం. యాంత్రీకరణ ఏ స్థాయిలో ప్రజల ఉపాధిని కొల్లగొట్టిందో తెలిపేందుకు ఇదో చిన్న మచ్చుతునక మాత్రమే! ఈ మధ్యన(నవంబర్ 23, 2013) ‘మింట్' పత్రికలో వచ్చిన ఒక కథనం ప్రకారంగా, ‘విద్యుత్ ప్లాంట్లు, లోకోమోటివ్ లు, వేగన్ల నిర్మాణ కర్మాగారాల వంటి భారీ పరిశ్రమలలో నేడు పెద్ద స్థాయిలో యాంత్రీకరణ జరుగుతోంది'.

గతంలో; ఈ కర్మాగారాలలో చాలా పెద్ద సంఖ్యలో, నిపుణులైన కార్మికులకు పని దొరికేది. నేడది మారిపోతోంది. ఇక; పంచదార మిల్లులు, ఇటుక బట్టీలు వంటి చిన్న తరహా, స్థానిక పరిశ్రమలలోనూ పరిస్థితి ఇటువంటిదే. వీటిలోనూ-యాంత్రీకరణ వేగం పుంజుకుంది. ఉదాహరణకు, పశ్చిమ బెంగాల్ లోని 24 పరిగణాల జిల్లాలోని ఒక వేగన్ నిర్మాణ కర్మాగారంలో-ఈ మధ్యన కొత్తగా, వేగన్ల ఛాసిస్ ల తయారీకి సంబంధించి, ఆధునాతన యంత్రాన్ని ప్రవేశపెట్టారు. దీనితో; 300 కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. కాగా, కర్మాగారంలో ఇక నేడు మిగిలి ఉన్న 500మంది కార్మికులు కూడా, తమ పరిస్థితి కూడా ముందు ముందు-ఇలాగే ఉంటుందని గుర్తించినట్లుగానే ఉంది. మరో కొత్త యంత్రం వస్తే ఈ మిగిలిన వారి ఉపాధి కూడా ఊడిపోగలదు! అదీ విషాధం. ఈ విధంగా, పెరిగిపోతోన్న యాంత్రీకరణ వలన ప్రపంచం యావత్తు నిరుద్యోగం పెరిగిపోతోంది. మరో పక్కన ధనిక దేశాలలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీనికి కారణం; ఆ దేశాలలోని కార్మికులు, ఉద్యోగుల వేతనాలు అధికంగా ఉండడం కూడా. ఈ ధనిక దేశాలలోని అధిక కార్మిక వేతనాల వలన, ఈ దేశాల పరిశ్రమలు-చౌక శ్రమ శక్తిని వెతుక్కుంటూ వెనకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తరలివెళ్లిపోయాయి. స్థూలంగా ఇదీ విషయం.

కాగా, పెరిగిపోతోన్న ఈ నిరుద్యోగ సైన్యం వలన, నేడు వివిధ దేశాలలో ఉపాధిలో ఉన్న కార్మికుల జీవితాలు కూడా అంతంత మాత్రంగానే మారిపోయాయి. ఉపాధి కోసం మార్కెట్లో, అభ్యర్థుల మధ్యన తీవ్ర పోటీ నెలకోవడం వలన, కార్మిక శక్తికి డిమాండ్ కంటే సరఫరా అధికమై, కార్మికుల వేతనాలు పడిపోతున్నాయి. పని పరిస్థితులు దిగజారుతున్నాయి. యజమానులతో వారి బేరసారాల శక్తి క్షీణిస్తోంది. ఈ క్రమంలోనే, క్యాజువల్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల సంఖ్య పెరిగిపోతోంది. మొత్తంగా, గత పలు సంవత్సరాలుగా దేశంలోనూ, వెలుపల కూడా ఉద్యోగులు, కార్మికుల వేతనాల పెరుగుదల స్తంభించి పోయింది. మరో పక్కన; ఉత్పాదకత పెరుగుదల వలన- పెట్టుబడిదారుల లాభాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. పేద-ధనిక వ్యత్యాసాల పెరుగుదలకు ఇది కూడా ఒక మూలం.

అంతిమంగా, 2008లో ఆరంభమైన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, నేడు చాప కింద నీరులా, విస్తృతిలోనూ, తీవ్రతలోనూ రోజు రోజుకు ముదిరిపాకాన పడుతోంది. ఈ పరిస్థితిని ‘అధిగమించేందుకు' పెట్టుబడిదారి దేశాల పాలకులు చేస్తోన్న ప్రయత్నాలు-కేవలం తాత్కాలిక ఉపశమనాలు గానే ఉంటున్నాయి. అంటే, నేడు నడుస్తున్నది, కేవలం ఒక తీవ్ర ఆర్థిక మాంద్యమే కాదు, అది వ్యవస్థాగత సంక్షోభం. పరిశ్రమల స్థాపనకూ, తద్వారా ప్రజలకు ఉపాధి కల్పనకూ గానూ-నేడు ప్రధాన ఆటంకంగా ఉంది-లాభాలే పరమావధిగా నడుస్తోన్న వ్యవస్థ. ఈ వ్యవస్థలో కేవలం లాభాలే, ఇతర అన్ని అంశాలను నిర్ణయిస్తాయి... ఇటువంటి స్థితిని మార్చివేసి, ‘ప్రాణం లేని పెట్టుబడి, ప్రాణం ఉన్న మనుషులను శాసించే స్థితి నుంచి- ప్రాణం ఉన్న మనుషులు, ప్రాణం లేని పెట్టుబడిని తమ ప్రయోజనాలకై లోబర్చుకోగలిగే' వరకూ- ఈ దుస్థితికి పరిష్కారం లేదు. అటువంటి వ్యవస్థలోనే, మొత్తం మానవాళి ప్రయోజనాలూ, సంక్షేమం, ఉపాధి కోసం- ‘పెట్టుబడులు', నడిపించబడతాయి.

- డి. పాపారావు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+