విస్తుపోయే 'క్రైమ్' లెక్కలు: ఏపీలో ఆ రెండే మహిళలకు సేఫ్, పెరిగిపోతున్న కేసులు..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు నేర ప్రవృత్తి విస్తరిస్తోంది. మహిళా రక్షణ ప్రశ్నార్థకమైపోతుండగా.. ఆస్తి తగాదాలు, కిడ్నాపులు వంటి నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. రోజు రెండు కేసుల చొప్పున.. నెలకు 60కేసులు.. నాలుగు నెలలకు ఏకంగా 240కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు.
గతేడాది ప్రమాదకరస్థాయిలో మహిళలపై దాడులు చోటు చేసుకోగా.. ఈ సంవత్సరం అది మరింత పెరిగింది. 13 జిల్లాల్లో గత సంవత్సరం మహిళలపై 16,853 నేరాలు నమోదైతే..ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే (ఏప్రిల్-జూలై) 5,673 కేసులు నమోదవడం గమనార్హం.
ప్రకాశం, చిత్తూరు తప్ప:
మహిళా రక్షణ విషయంలో రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు, కోస్తాలో ప్రకాశం మాత్రమే మెరుగ్గా ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలు కొంతమేర మెరుగ్గా ఉన్నాయి. మిగతా జిల్లాల్లో వారికి రక్షణ కొరవడింది. బుధవారం బుధవారం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో పోలీసుశాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి నాలుగు నెలల పనితీరును విశ్లేషిస్తూ ఈ క్రైమ్ లెక్కల్ని బయటపెట్టారు. ఈ కాలంలో 240కన్నా ఎక్కువ నేరాలు మహిళలపై ఎనిమిది జిల్లాల్లో జరిగాయి.
ఆస్తి తగాదాలు, హత్యలు:
ఆస్తి తగాదాకు సంబంధించిన నేరాల్లో ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి. అనంతపురం, గుంటూరు, కడప, కృష్ణా, తిరుపతి అర్బన్లలోనూ ఎక్కువగానే కేసులు నమోదవుతున్నాయి.
గడిచిన నాలుగు నెలల్లో అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 40కి మించి హత్యలు జరగ్గా, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలు 25 హత్యలతో రెండో స్థానంలో ఉన్నాయి.
రోడ్డు ప్రమాదాలు:
రోడ్డు ప్రమాదాల్లో ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి. 4 నెలల కాల వ్యవధిలో ఇక్కడ 700 పైచిలుకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో చిత్తూరు పోలీసులు సక్సెస్ అయ్యారు. 100లోపు రోడ్డు ప్రమాదాలతో రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా చిత్తూరు కింది వరుసలో ఉండటం గమనార్హం.
కిడ్నాప్, రేప్ కేసులు:
నెలకో 10కిడ్నాప్ కేసుల చొప్పున గుంటూరు, నెల్లూరు జిల్లాలు అందులో ముందు వరుసలో ఉన్నాయి. ఇక అత్యాచార కేసుల విషయానికొస్తే.. పశ్చిమగోదావరి జిల్లాలో 50కి మించి, పక్కనే ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో 70కన్నా ఎక్కువ నమోదయ్యాయి.
ఎస్సీ, ఎస్టీలపై నెల్లూరు జిల్లాలో రోజుకొక కేసు చొప్పున నమోదయ్యాయి. ఉభయ గోదావరి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 70కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చిన్నారులపై దాడులు అధికంగా జరుగుతున్నట్లు పోలీసుశాఖ నివేదిక చెబుతోంది.