ఒడిశా అవిభక్త కవలలను విడదీశారు: మరి వీణా-వాణీల పరిస్థితి ఏంటి?
న్యూఢిల్లీ: దేశంలో తొలిసారి అత్యంత అరుదైన శస్త్రచికిత్సను అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) వైద్యులు పూర్తి చేశారు. ఒడిశాకు చెందిన 28 నెలల వయసున్న అవిభక్త కవలలు జగ, కాలియాలకు ఎయిమ్స్ నిపుణుల బృందం 16 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి వేరుచేసింది.
వీణా-వాణీ: 14ఏళ్ల వ్యథ తీరేదెప్పుడు?
అయితే వారి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. వారిని వెంటిలేటర్పై ఉంచి, నిరంతరాయంగా రక్తం ఎక్కిస్తూ.. నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు.
అదే మా కోరిక: 15వ పుట్టిన రోజు జరుపుకున్న వీణా-వాణీ
18తర్వాతే..
అవిభక్త కవలల శస్త్రచికిత్స విజయవంతమైందీ లేనిదీ తేలేందుకు వచ్చే 18 రోజులు అత్యంత కీలకమని వెల్లడించారు. కవలల్లో ఒకరి పరిస్థితిపై వైద్యబృందం ఆందోళన చెందుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ శస్త్రచికిత్స కోసం వైద్యులు సవాళ్లు ఎదుర్కొన్నట్లు ఎయిమ్స్ న్యూరోసైన్సెస్ కేంద్రం అధిపతి ఏకే మహాపాత్ర తెలిపారు. ఆపరేషన్ సమయంలో 3.5 లీటర్ల రక్తం పోయినట్లు వివరించారు.
పెద్ద సవాలుగానే శస్త్రచికిత్స
కవలల్లో జగ పరిస్థితి విషమంగా ఉండగా కాలియా పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స కోసం 20 యూనిట్ల రక్తం అవసరమైంది. పిల్లల్లో ఒకరికి రక్తనాళాలు లేకపోవడంతో వాటిని రూపొందించాల్సి వచ్చింది. వేరుచేసిన తర్వాత మెదడు భాగానికి ఇరువైపులా చర్మాన్ని అమర్చడం అతిపెద్ద సవాల్గా నిలిచింది. గతంలో చేసిన శస్త్రచికిత్స ద్వారా రూపొందించిన చర్మాన్ని అతికినట్లు ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతి మనీష్ సింఘాల్ తెలిపారు. శస్త్రచికిత్సలో న్యూరో సర్జన్ దీపక్ గుప్త కీలకపాత్ర పోషించారు. ఆ సమయంలో వైద్య బృందం వారికి ఆహార పరంగాను, ఆరోగ్యపరంగాను అనేక జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.
చాలా అరుదు..
ఒడిశాలోని కంధమాల్ జిల్లా మిలిపడాకు చెందిన ఈ కవలలు రెండేళ్ల క్రితం తలలు అతుక్కొని పుట్టారు. ఇలా జరగడం చాలా అరుదని.. 3 లక్షల మంది పిల్లల్లో ఒకసారి ఇలా పుడుతుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారిలో కూడా 50 శాతం మంది పుట్టిన వెంటనే లేదా 24 గంటల్లో చనిపోతుంటారని వైద్య నిపుణుడొకరు తెలిపారు. అయితే, ఈ అవిభక్త కవలలను వేరుచేసే వైద్య ప్రక్రియ కోసం జులై 13న ఎయిమ్స్లో చేర్పించారు.
ఒక రోజుపాటు శస్త్రచికిత్స
అప్పట్లో రక్తాన్ని సరఫరా చేసే సిరలను వేరుచేస్తూ (బైపాస్) శస్త్రచికిత్స తదితర ప్రక్రియలను పూర్తిచేశారు. తాజాగా ఎయిమ్స్కు చెందిన న్యూరో సర్జరీ, న్యూరో ఎనస్థీషియా, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలకు చెందిన 30 మంది వైద్య నిపుణులు రెండోదశ శస్త్రచికిత్సను పూర్తిచేశారు. బుధవారం ఉదయం ప్రారంభించిన శస్త్రచికిత్స గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ముగియడం గమనార్హం. అంటే దాదాపు ఒకరోజుపాటు ఈ శస్త్రచికిత్సను చేశారు. దేశంలో ఇలాంటి శస్త్రచికిత్సలు గతంలో రెండు మాత్రమే జరగ్గా.. అవి విజయవంతం కాలేదు. ఇప్పుడు మాత్రం ఈ పిల్లల ప్రాణాలు నిలబడాలని కోరుకుందాం.
వీణా-వాణీల పరిస్థితి ఏంటీ?
ఒడిశాకు చెందిన అవిభక్త కవలలైన జగ, కలియాలను దిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స చేసి వేరుచేయడంతో రాష్ట్రానికి చెందిన వీణా-వాణిల విషయంలోనూ ఏదైనా పురోగతి కనిపిస్తుందా.. వారిని వేరుచేయడం సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన మురళి, నాగలక్ష్మి దంపతులకు 2003లో తలలు అతుక్కున్న స్థితిలో వీణా వాణిలు జన్మించారు. వారిని శస్త్రచికిత్స ద్వారా వేరుచేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా అవేవీ సఫలం కాలేదు. 15 ఏళ్ల వయసున్న వీణావాణిలు ప్రస్తుతం అమీర్పేటలోని స్టేట్హోంలో ఉంటున్నారు.
అయితే, ఒడిశాకు చెందిన అవిభక్త కవలలు జగ, కలియాల మాదిరిగా వీణా-వాణిలకు కూడా మెదళ్లు వేరుగానే ఉన్నా.. గుండె నుంచి మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళం (డ్యూరల్ సైనస్) ఇద్దరికీ ఒక్కటే ఉంది. దీనిని వేరు చేయడం అంత సులభం కాదు. వారి ప్రాణాలకే ప్రమాదం. దీనికి ఐదు అంచెల శస్త్ర చికిత్స అవసరమని లండన్ వైద్యులు తేల్చారు. మొదట ఇద్దరిలో ఒక్కటిగా ఉన్న రక్త నాళాన్ని చికిత్స చేసి దానిని ఒకరికే పరిమితం చేయాలి. ఇంకొకరిలో ఈ వ్యవస్థను కొత్తగా నెలకొల్పాలి. ప్రస్తుత ఆధునిక వైద్యంలో ఇది సాధ్యమేనని వైద్యులు చెప్పారు. అయితే, జగ, కలియాల శస్త్రచికిత్స విజయవంతమైతే.. వీణా-వాణీలను కూడా వేరు చేసేందుకు నిపుణులైన వైద్యులు ధైర్యం చేసే అవకాశం ఉంటుంది.