పార్టీ పండగ: మార్చి 29కి టీడీపీకి 34 ఏళ్లు
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి మార్చి 29వ తేదీకి 34 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆరోజు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామగ్రామాన టీడీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. సోమవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన పార్టీ పొలిట్బ్యూరో సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు పార్టీ నేతలు తెలిపారు.
సమావేశ అనంతరం తీసుకున్న నిర్ణయాలను పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, ఎల్. రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్లో అనుకున్న విధంగా నిధులను కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలుగు ప్రజలను కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని తెలిపారు. పార్టీకి చెందిన రెండు రాష్ట్రాల ఎంపీలు ఈ అంశంపై కేంద్రంతో చర్చించాలని నిర్ణయించారు. ఏపీలో కొత్తగా ఏర్పాటు చేసిన మూడు అనుబంధ (గ్రాడ్యుయేట్లు, అంగన్వాడీ, టీచర్ల) సంఘాల సభ్యత్వ కార్యక్రమాన్ని అడ్హాక్ కమిటీల నేతృత్వంలో చేపట్టాలని నిర్ణయించినట్టు ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు చెప్పారు.

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని మొదటిగా 2009లో కేంద్రాన్ని డిమాండ్ చేసింది తమ అధినేత చంద్రబాబేనని, ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆ అంశంపై మాట్లాడటం టీడీపీ విజయంగా భావిస్తున్నామని తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు.
ఉపాధి హామీని చేనేత రంగానికి కూడా వర్తింపజేసేలా పొలిట్బ్యూరో కోరినట్టు ఆయన వెల్లడించారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తును తొలిగించి కార్మికుల ఉపాధిని కాపాడాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాయాలని నిర్ణయించామన్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలోనూ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు.












Click it and Unblock the Notifications