జయప్రకాశ్ సత్తా ఏది?

జెపి విధానాలు ఆదర్సపూరితంగా ఉంటాయి. ఏ సమస్యకు కూడా ఆయన నిర్దిష్టమైన పరిష్కారాన్ని చూపలేరు. సమాజం పూర్తిగా మారాల్సిందేనని, ఆ మార్పు కోసం ప్రయత్నాలు చేయాలని ఆయన అంటారు. అందుకు తనను బలపరచాలని ఆయన చెప్పకనే చెప్తారు. నిజమే, జెపి చెప్పినట్లు సమాజంలోని అన్ని వ్యవస్థలూ భ్రష్టు పట్టిపోయాయి. కానీ, పరిష్కారాలేవీ ఆయన వద్ద లేవు. మార్పు అనేది మెట్లు మెట్లుగా ఉంటుందనే విషయాన్ని ఆయన అంగీకరించరు. తన పార్టీ మాత్రం మార్పు కోసం క్రమంగా ఎదుగుతుందని ఆయన బహుశా నమ్ముతారు. కానీ, అదే సాధ్యం కావడం లేదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ వచ్చినప్పుడు రాష్ట్రం ఏర్పడడం వల్ల కలిగే లాభమూ లేదు, జరిగే నష్టమూ లేదని అంటారు. అంటే, మార్పును ఆయన ఇష్టపడడం లేదని భావిస్త్తారు. ఆయన వ్యవహారశైలిపై పలు ప్రకటనలు, పార్టీ నిర్ణయాల విషయంలో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆయన కోస్తాంధ్రకు, కమ్మ కులానికి అనుకూలమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెసు పార్టీకి లోకసత్తా అనుకూలంగా వ్యవహరిస్తోందని, తమను ఓడించడానికే లోకసత్తా రంగంలోకి వచ్చిందని తెలుగుదేశం పార్టీ కూడా జెపిపై విమర్శలు చేసింది. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశంతో కలిసి యాత్రకు వెళ్లినా రావాల్సినంత గుర్తింపు రాలేదు. అంతా తెలుగుదేశం పార్టీయే కొట్టేసింది.
ఎన్నికల్లో లోకసత్తా నాయకులు, అభ్యర్థులు మిగతా పార్టీలవారికి భిన్నంగా వ్యవహరించలేదనే విషయాన్ని ప్రజల అనుభవంలోకి వచ్చింది. జెపి ఎంత చెప్పినా పైసలు దండిగానే ఖర్చు పెట్టారని విమర్సలు వచ్చాయి. ఆయన అసెంబ్లీలో, వెలుపలా చేసిన ప్రసంగాలకు మాత్రం మీడియా ప్రచారం దండిగానే దక్కుతూ వస్తోంది. ఆ రకంగా ఆయన మీడియా టైగర్ గా మిగిలిపోయారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాలు తెరిపి లేకుండా సాగుతుంటే జెపి గొంతు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. ఇందుకు కారణమేమిటో తెలియదు. ఏమైనా, జెపి వ్యవహారం చెప్పేందుకే తప్ప ఆచరించడానికి కాదన్నట్లుగా తయారైంది.












Click it and Unblock the Notifications