ఆంధ్రప్రదేశ్ లో కర్ణాటక స్థితి?

కాంగ్రెసు పార్టీతో పొత్తుకు ఇప్పటికే చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ అంగీకిరంచింది. ఆ పార్టీ ముఖ్యమంత్రి రోశయ్య మంత్రివర్గంలో చేరేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అక్టోబర్ నెలాఖరు కల్లా ఆ విషయం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా ముఖ్యమంత్రి రోశయ్య తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థకరిస్తారని చెబుతున్నారు. ఈ పునర్వ్యస్థీకరణ సమయంలోనే చిరంజీవి పార్టీ ప్రభుత్వంలో చేరే అవకాశం ఉంది. వైయస్ జగన్ వర్గానికి చెందిన మంత్రులకు రోశయ్య ఉద్వాసన చెబుతారని అంటున్నారు. జగన్ వర్గం అసమ్మతి కుంపటి రాజేసినా చిరంజీవి పార్టీ మద్దతు తమకు ఉంటుందని కాంగ్రెసు నాయకత్వం విశ్వాసంతో ఉంది.
అలాగే, మజ్లీస్ కూడా కాంగ్రెసు పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ముందుకు వస్తుందని భావిస్తున్నారు. గతంలో మజ్లీస్ నాయకులు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి దగ్గరగా ఉన్నప్పటికీ ప్రస్తుతం రోశయ్య ప్రభుత్వాన్ని కాపాడేందుకు ముందుకు వస్తారని అంటున్నారు. ఈ విషయంపై మజ్లీస్ నాయకుడు అసదుద్దీన్ తో కాంగ్రెసు అధిష్టానం చర్చలు జరిపినట్లు కూడా చెబుతున్నారు. కాగా, కాంగ్రెసులోని మెజారిటీ శాసనసభ్యులు ఎన్నికలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా లేరని సమాచారం. జగన్ వెంట డజనుకు మించి కూడా శాసనసభ్యులు లేరని, వారు బయటకు వెళ్లిపోయినా అసమ్మతి కుంపటి రాజేసినా రోశయ్య ప్రభుత్వం పడిపోదని అంటున్నారు. వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడ కూడదని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటోంది. రోశయ్య ప్రభుత్వాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్న తర్వాతనే జగన్ వర్గంపై కాంగ్రెసు నాయకత్వం చర్యలకు పూనుకుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications