కెసిఆర్ మొండిఘటం
విజయవాడ సభకు వెళ్లాలనే కెసిఆర్ నిర్ణయానికి సీమాంధ్ర నాయకులు ఆహ్వానం పలికారు. విజయవాడకు కెసిఆర్ ను సాదరంగా ఆహ్వానిస్తామని వారు చెప్పారు. ఈ స్థితిలో తెలంగాణ నుంచి ఆయన నిర్ణయానికి వ్యతిరేకత ఎదురైంది. కెసిఆర్ విజయవాడకు వెళ్లొద్దంటూ తెలంగాణలోని సంస్థలు కొన్ని ప్రకటనలు చేశాయి. ఈ స్థితిలో కెసిఆర్ వ్యూహం బెడిసి కొట్టిందని, ఆయన విజయవాడ పర్యటనను రద్దు చేసుకుంటారని ప్రచారం జోరందుకుంది.
నిజానికి, కెసిఆర్ ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత దాని లాభనష్టాల గురించి గానీ పరిణామాల గురించి గానీ ఆలోచించరు. ముందుకే సాగుతారు. విజయవాడకు వెళ్లాలనే తన నిర్ణయంలో మార్పు లేదని కెసిఆర్ తాజాగా ప్రకటించడాన్నిబట్టి చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. కత్తి పద్మారావు మరోసారి సోమవారం కెసిఆర్ ను కలిశారు. ఈ భేటీ తర్వాత కత్తి పద్మారావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కెసిఆర్ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ నెల 29వ తేదీన జరగాల్సిన జై ఆంధ్ర మహాసభ తుఫాను కారణంగా వాయిదా పడిందని, సభ రద్దు కాలేదని ఆయన చెప్పారు. ఈ సభకు కెసిఆర్ తప్పకుండా వస్తారని ఆయన చెప్పారు. కెసిఆర్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తాను విజయవాడ సభకు వెళ్లి తీరుతానని చెప్పారు.