రోశయ్యకు చాన్స్: కాంగ్రెసు వ్యూహం, జయ కోరికా అదే

గతంలో మహారాష్ట్ర గవర్నర్గా నియమించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తమిళనాడుకు పంపించడం వెనుక కాంగ్రెసు వ్యూహంతో పాటు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కోరిక మేరకే రోశయ్యను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2జి కుంభ కోణంలో డిఎంకె ఎంపీల అరెస్టుల కారణంగా కాంగ్రెసు, డిఎంకె మధ్య స్నేహం క్రమంగా తగ్గుతూ వస్తోంది. వారి పొత్తు ఏ క్షణంలోనైనా ఆవిరిగావచ్చు. ఇలాంటి సమయంలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జయలలితతో సన్నిహితంగా ఉండి కాంగ్రెసు, ఎడిఎంకె మధ్య సఖ్యత నెలకొల్పే వారు ప్రస్తుతం కావాల్సి ఉంది. రోశయ్య తన చతురతతో ఆ పని చేయగలరని కాంగ్రెసు భావిస్తోంది. అందుకే మొదట మార్గరేట్ ఆల్వాని గవర్నర్గా నియమించాలని అధిష్టానం అనుకున్నప్పటికీ ఆ తర్వాత రోశయ్య వైపు మొగ్గు చూపింది.
తమిళనాడులో తెలుగు వారు అధికంగా ఉన్న నేపథ్యంలోనూ రాజకీయంగా లాభిస్తుందని కాంగ్రెసు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్నింటికి మించి ముఖ్యమంత్రి జయలలిత సైతం రోశయ్య వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ విషయాన్ని అన్నాడిఎంకె నేతలే చెబుతున్నారట. తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఉన్నా తెలుగువారే గవర్నర్గా ఉన్నారు. ఈ సారీ ఆ సెంటిమెంటు ఫలించడంతో పాటు రోశయ్య వంటి పెద్దాయన వస్తే తనకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తారని ఆమె భావించినట్లుగా తెలుస్తోంది. కేంద్రంలోనూ రోశయ్యకు పలుకుబడి ఉండటంతో ఆయన రాష్ట్రానికి భారీగా నిధులు తీసుకు వచ్చే అవకాశం ఉందని జయలలిత భావించినట్లుగా సమాచారం. మొత్తానికి అన్నాడిఎంకెతో సఖ్యత కోసం కాంగ్రెసు, నిధులు, పాలనాపరమైన సహకారం కోసం జయలలిత ఇరుపార్టీలు తమ తన రాజకీయ ప్రయోజనాల కోసం రోశయ్యను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది!












Click it and Unblock the Notifications