కిరణ్ కుమార్ రెడ్డి బలపడుతున్నారా?
ఆ విశ్వాసంతోనే త్వరలోనే మంత్రివర్గ మార్పులుంటాయని కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారని అంటున్నారు. అంతేకాకుడా వివిధ కార్పొరేషన్లకు, సంస్థలకు నామినేటెడ్ పదవుల నియామకానికి ముఖ్యమంత్రికి అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. దీంతో అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చే యోచనను పక్కకు పెట్టిందని అంటున్నారు. తెలంగాణపై నిర్ణయానికి ముఖ్యమంత్రి మార్పునకు ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ఈ స్థితిలో వచ్చే ఎన్నికల వరకు గానీ తెలంగాణపై నిర్ణయం తీసుకునే వరకు గానీ ముఖ్యమంత్రి మార్పు ఉండదనే మాట గట్టిగానే వినిపిస్తోంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఒకసారి మాత్రమే వైయస్ రాజశేఖర రెడ్డి నామినేటెడ్ పదవుల నియామకం జరిపారు. ఆ తర్వాత వాటి జోలికి వెళ్లలేదు. పదవుల నియామకం జరుపుదామని అనుకున్నప్పుడల్లా పార్టీలోని సీనియర్ నేతలు కొందరు ఏదో ఒక వివాదాన్ని తెరపైకి తెచ్చేవారు. దాంతో ఆయన నామినేటెడ్ పదవుల నియామకానే్న మానుకున్నారు. వైయస్ తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కె రోశయ్య కూడా తనకు కావలసిన నలుగురైదుగురికి నామినేటెడ్ పదవులు ఇచ్చారే తప్ప పూర్తిస్థాయిలో నియామకాలు జరపలేదు.
కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఇంతకు ముందు నిర్వహించిన ఇందిరమ్మ బాటలో కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రసంగాలు ఇటీవలే ముగిసిన ప్రకాశం జిల్లా ఇందిరమ్మ బాటలో చేసిన ప్రసంగాలకు తేడా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా ఇందిరమ్మ బాటలో చేసిన ప్రసంగాల్లో కిరణ్ కుమార్ రెడ్డిలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపించిందని అంటున్నారు.
ఇంతకు ముందు కార్యక్రమాల అమలు గురించి మాట్లాడినప్పుడు కాంగ్రెసు ప్రభుత్వం అని చెప్పేవారు ఇప్పుడు నేను చేశాను, నేను చేస్తానని చెబుతున్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ విషయంలో వైయస్ రాజశేఖర రెడ్డి, కె. రోశయ్య చెల్లించని బాకీలను తాను చెల్లించానని చెప్పుకున్నారు. ఈ రకంగా తాను తన స్థానాన్ని స్థిరపరుచుకుని, నిలదొక్కుకోవడం వల్లనే ఆలా మాట్లాడుతున్నారని అంటున్నారు.