నీది నీదే.. నాది నాదే!: కిరణ్ భరోస, బొత్స నో
ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళితే పార్టీ విజయం సాధిస్తుందని కిరణ్ చెప్పగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సమస్యలు తేల్చితే, వాటిపై ఓ నిర్ణయానికి వస్తేనే పార్టీ పటిష్టం అవుతుందని చెప్పారట. తన ముందు ఎవరి వాదన వారు వినిపించడంతో రాహుల్ ఖంగు తిన్నారట. రాష్ట్రాల అక్షర క్రమంలో రాహుల్ నేతలకు మాట్లాడే అవకాశమిచ్చారు.
దీంతో ఎపి నుండి తొలుత బొత్స మాట్లాడారు. తెలంగాణ, జగన్ విషయంలో స్పష్టత ఏర్పడనంత కాలం పార్టీ పటిష్ఠం కాదని ఆయన చెప్పారట. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం అవసరమని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీకే వదిలేయాలని ఆయన సూచించినట్లుగా సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీ విజయం సాధించడం కష్టమని, పార్టీని వేధిస్తున్న సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని బొత్స స్పష్టంగా చెప్పారని తెలుస్తోంది.
పార్టీ నుంచి విడిపోయిన జగన్తో అనేకమంది చేతులు కలుపుతున్నారని, దీన్ని నిరోధించేందుకు గట్టి వైఖరిని అవలంబించాల్సి ఉన్నదని చెప్పారు. భవిష్యత్తులో జగన్తో కాంగ్రెస్ పార్టీ చేతులు కలుపుతుందేమోనన్న అనుమానాలు పార్టీలో చాలామందికి ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక, ముఖ్యమంత్రి అందుకు భిన్నంగా మాట్లాడారు. ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళితే కాంగ్రెస్ పార్టీకే ఘన విజయం దక్కుతుందని, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని కిరణ్ చెప్పారు.
ప్రభుత్వ పథకాలవల్లే రాష్ట్ర ప్రజల్లో పార్టీ పట్ల ఆదరణపెరుగుతోందని, ప్రజా సంక్షేమ పథకాల ద్వారానే ప్రజలకు సన్నిహితం కాగలమని ఆయన చెప్పారు. సహకార ఎన్నికల్లో పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చాయని, స్థానిక ఎన్నికల్లో పాల్గొనడం ద్వారానే పార్టీని కిందిస్థాయి నుంచి పటిష్ఠం చేయగలమని అన్నారు. భావోద్వేగపూరితమైన సమస్యలకు దీర్ఘకాలిక దృష్టితో పరిష్కారం అవసరమని అభిప్రాయపడ్డారు. కీలక సమస్యలపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రాహుల్కు భరోసా ఇచ్చారు.
రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఒక ఎత్తు, గత రెండేళ్లలో ప్రవేశ పెట్టిన పథకాలు మరో ఎత్తని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలందరూ ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నవారేనని తెలిపారు. మహిళలు, విద్యార్థులు, రైతులు, బడుగు, బలహీనవర్గాల ప్రజలపై శ్రద్ధ పెట్టామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పిస్తూ తాము చేసిన చట్టం, మహిళా స్వయం సహాయక సంఘాల కోసం ఏర్పాటుచేయ తలపెట్టిన బ్యాంకు దేశానికే ఆదర్శమని వెల్లడించారు. రాష్ట్రంలో చేపడుతున్న పథకాలు మరోసారి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకు వస్తాయని కిరణ్... రాహుల్కు భరోసా ఇచ్చారట.