విభజన: వైఎస్ బాటలో కిరణ్!, చిరుకూ సీన్ లేదా?
2004లో తెలంగాణపై హామీ ఇచ్చిన కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009 ఎన్నికలకు ముందు అధికార పార్టీకి తెలంగాణ అంశం గుర్తుకు వచ్చింది. తెలంగాణపై కదలిక వచ్చినప్పటికీ, నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి దానిని అడ్డుకున్నారనే వాదన ఉంది. అయితే 2009 ఎన్నికలలో తెలంగాణపై హామీతోనే కాంగ్రెసు ప్రచారం చేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే సమయంలో వ్యతిరేకంగా పావులు కదిపే ప్రయత్నాలు చేస్తున్నారట.
విభజన వద్దని, ప్యాకేజీతో సరిపెడదామని ఢిల్లీ పెద్దలకు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకే ఈ విషయాన్ని చెబుతామంటే అమె నిర్ద్వంధంగా తోసిపుచ్చినట్లు వార్తలు వచ్చాయి. నాడు వైయస్ అధిష్టానాన్ని ప్రభావితం చేశారని, ఇప్పుడు కిరణ్ అంత స్థాయిలో ప్రభావితం చేయగలరా? అనే చర్చ రాజకీయా వర్గాల్లో సాగుతోందట. నాడు డి.శ్రీనివాస్ వంటి నేతలు తెలంగాణ కోసం ఒత్తిడి తెచ్చినప్పటికీ అధిష్టానం వైయస్ పైన నమ్మకం పెట్టుకుంది. అనుకున్నట్లుగానే ఆయన పార్టీని గెలిపించారు. ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం కూడా అందుకు దోహదపడిందని చెప్పవచ్చు.
అయితే ఇప్పుడు నాటి వైయస్లా కిరణ్ ప్రభావితం చేయలేకపోవచ్చునని అంటున్నారు. అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ మరీ ఇంత బలంగా లేకపోవడం, ప్రతిపక్ష ఓట్లు ప్రజారాజ్యం చీల్చడం వంటి వాటివి కాంగ్రెసుకు లాభం చేకూర్చాయి. అప్పుడు అంతా కాంగ్రెసుకు అనకూలంగా ఉంది. అంతేకాకుండా వైయస్ చెప్పిందే వేదం. కాంగ్రెసు నేతలు వైయస్ గీత దాటకపోయేవారు! అధిష్టానం రాష్ట్ర బాధ్యత అంతా ఆయన మీదే వేసింది.
ఇప్పుడు అలా లేదు. విభజనపై నిర్ణయం తీసుకోకుంటే కిరణ్ గెలిపిస్తాడనే నమ్మకం అధిష్టానానికి ఏ కోశాన లేవంటున్నారు. కిరణే కాకుండా కేంద్రమంత్రి చిరంజీవి సహా ఎవరికి అంత సీన్ లేదని అధిష్టానం భావిస్తోందంటున్నారు. మరోవైపు ఇప్పుడు కాంగ్రెసు పార్టీ పట్ల పూర్తి వ్యతిరేకత ఉంది. తెలంగాణ సెంటిమెంట్ చాలా బలంగా ఉండటం, సీమాంధ్రలో జగన్ ఫ్యాక్టర్, పదేళ్లుగా అధికారంలో ఉండటంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత... ఇలా అన్ని తమకు వ్యతిరేకంగానే ఉన్నాయని అధిష్టానం భావిస్తోందట.
ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ఎంతలా లాబీయింగ్ చేసినా ఫలితం ఉండదని, సీమాంధ్ర నేతలు ప్రయత్నాలు చేసినా దానిని అధిష్టానం ఖాతరు చేసే అవకాశం లేదని అంటున్నారు. తెలంగాణ ఇస్తేనే రాజకీయ ప్రయోజనాలు సాధించవచ్చునని కొందరు నేతలు పదేపదే చెబుతుండడం, దానికి విరుగుడుగా కిరణ్ ఎలాంటి ఎత్తుగడలూ వేయకపోవడంతో మళ్లీ తెలంగాణ ఏర్పాటును అజెండాగా మార్చుకుందని అంటున్నారు. అయితే కిరణ్, సమైక్యనేతలు అడ్డుకోగలరా అనే చర్చ సాగుతోంది.