తెగించిన బిజెపి: మోడీపైకి తిప్పిన చంద్రబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి వచ్చేదే ఉంటుంది గానీ పోయేదేమీ లేదు. గత ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకున్న బిజెపి నామ్ కే వాస్తేగా పార్లమెంటు, అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. చంద్రబాబుతో స్నేహం వల్ల బిజెపి లాభపడింది తక్కువే గానీ, చంద్రబాబు మాత్రం బాగానే లాభపడ్డారనే విశ్లేషణ తాజాగా జరుగుతోంది. పైగా, ఎపిలో తమ పార్టీ పెరుగుదలకు చంద్రబాబు ఆటంకంగా ఉన్నారనే అభిప్రాయానికి కూడా బిజెపి నాయకత్వం వచ్చినట్లు ఉంది.
దాంతో ఇటీవల దాకా ప్రత్యేక హోదాపై దాగుడు మూతలు ఆడుతూ వచ్చిన బిజెపి ముసుగు తొలగించి, ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేసింది. అంతేకాదు, చంద్రబాబు ప్రభుత్వానికి తాము ఇంతవరకు ఇచ్చిందేమిటో, చేసిన సాయమేమిటో లెక్కలతో సహా బిజెపి ఎపి ఇంచార్జీ సిద్ధార్థనాథ్ సింగ్ కుండబద్దలు కొట్టారు.
ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు అడగలేదని కూడా ఆయన చెప్పేశారు. దాంతో చంద్రబాబుతో నెయ్యం కయ్యంగా మారినా ఫరవాలేదనే తెగింపును బిజెపి ప్రదర్శించింది. కయ్యంగా మార్చే వ్యూహం కూడా బిజెపి రచించి అమలు చేసినట్లు కనిపిస్తోంది. బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి చంద్రబాబు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. అందుకు చంద్రబాబు చెబుతున్న కారణాలు కూడా ఉన్నాయి.

ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్ర మరో కారణం చెబుతున్నారు. నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్నారు కాబట్టే కేంద్రంపై చంద్రబాబు పోరాటం చేయలేకపోతున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. ఇందులో ఏ మేరకు నిజం ఉందనే విషయం తెలియదు గానీ ప్రజలు నమ్మడానికి మాత్రం అవకాశం ఉంది.
చంద్రబాబు తమతో తెగదెంపులు చేసుకోవడానికి ఇష్టపడడం లేదని గ్రహించిన బిజెపి నేతలు ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని కూడా సిద్ధార్థనాథ్ సింగ్ తప్పు పట్టారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నిజానికి, ఇటువంటి విమర్శలు సహించే తత్వం చంద్రబాబుది కాదు. కానీ ఆయన సహించడదానికే సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.
సిద్ధార్థనాథ్ సింగ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు సుతిమెత్తగా మాట్లాడుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల తీరుకు భిన్నమైంది కూడా. తమ ప్రత్యర్థులపై తెలుగుదేశం పార్టీ నాయకులు విరుచుకుపడిన, విరుచుకుపడుతున్న తీరును గమనిస్తే ఆ విషయం బోధపడుతుంది.
ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ట దెబ్బ తింటుందని టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వాగ్దానంలో బిజెపి పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా మోడీ ప్రతిష్ట దెబ్బ తింటుందని ఆయన అన్నారు. నీతి అయోగ్ను అడ్డం పెట్టడం సరి కాదని కూడా ఆయన అన్నారు. ఆ రకంగా సమస్యను ప్రధాని నరేంద్ర మోడీ కోర్టులోకి విసిరే ప్రయత్నం టిడిపి చేస్తోంది.

ఇదిలావుంటే, ప్రత్యేక హోదాపై తాము చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు వివరణ కూడా ఇచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇకాటంలో పెట్టే ఉద్దేశం తమకు లేదని, పరిస్థితిని కేంద్రానికి తెలియజేయడానికి మాత్రమే ప్రయత్నించామని వారు చెప్పుకున్నారు. అంటే, కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు ఎంత సుతిమెత్తగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
అయితే, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే వ్యాఖ్యల వల్ల బిజెపి అదనంగా జరిగే నష్టమేమీ లేదు. టిడిపి వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి, తమపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి బిజెపి నాయకులు సిద్ధపడ్డారు. దీనివల్ల ఎపిలో రాజకీయంగా తాము బలపడే అవకాశం కూడా లేకపోలేదనేది బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications