సిఎం క్యాండేట్ లేకుండా: వారిపై కెసిఆర్ దృష్టి
హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుకు ముందు 15 పార్లమెంటు స్థానాలు, వంద అసెంబ్లీ స్థానాలు టార్గెట్గా పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పుడు... అధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో పలువురు కాంగ్రెస్ ముఖ్యులు పోటీ చేసే స్థానాలపై తెరాస ప్రత్యేకంగా గురి పెట్టిందంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేస్తే, ముఖ్యమంత్రి పదవి రేసులో ఉంటారని ప్రచారం జరుగుతున్న డి శ్రీనివాస్, కె జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, డికె అరుణ, గీతారెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య పోటీ చేసే నియోజకవర్గాలపై తెరాస నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందట.
వారిని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించటం లక్ష్యంగా పావులు కదుపుతోందంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యుల్లో ఈసారి డిఎస్ నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్, జానారెడ్డి (నాగార్జునసాగర్), దామోదర రాజనర్సింహ (అందోల్), డికె అరుణ (గద్వాల), గీతారెడ్డి (జహీరాబాద్), శ్రీధర్ బాబు (మంథని), పొన్నాల (జనగామ) తమ తమ సిటింగ్ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.

అయితే ఆయా స్థానాల్లో తమ పార్టీ తరఫున బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని, తెలంగాణ కాంగ్రెస్కు తెలంగాణలో మెరుగైన నాయకత్వం లేకుండా చేయాలని తెరాస పథక రచన చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే డికె అరుణ నియోజకవర్గం గద్వాలలో ఆమె సమీప బంధువైన కృష్ణమోహన్ రెడ్డిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి తెరాసలో చేర్చుకొని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ప్రకటించారని అంటున్నారు.
నాగార్జునసాగర్లో టిడిపి నేత తేరా చిన్నప రెడ్డిని పార్టీలో చేర్చుకొని, ఆయనను జానారెడ్డిపై పోటీకి దించటానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దామోదరపై రసమయి బాలకిషన్ను బరిలోకి దించాలని భావిస్తోంది. మంథనిలో శ్రీధర్ బాబుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పుట్టా మధును తెరాసలో చేర్చుకొని, దుద్దిళ్లపై పోటీకి దించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితుడైన పొన్నాల లక్ష్మయ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామలో ఇప్పటి పార్టీ ఇన్చార్జి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గట్టి పోటీ ఇస్తారా? లేదా? అనే అనుమానాలు తెరాస ముఖ్యుల్లో ఉన్నాయి. ఈ మేరకు అక్కడా మరో సమర్థుడైన అభ్యర్థిని వెతికే పనిలో పార్టీ అధిష్ఠానం ప్రముఖులు ఉన్నట్లు తెరాస వర్గాలు భావిస్తున్నాయి.
డిఎస్, గీతారెడ్డి వంటి వారి పైన కూడా బలమైన అభ్యర్థుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. కాంగ్రెస్తో ఎన్నికల ముందు పొత్తు ఉన్నా లేకున్నా... ఫలితాల తర్వాత ఆ పార్టీతో అవగాహన కుదిరినా.. ముఖ్యమంత్రి రేసులో ఉండేవారి సంఖ్యను గణనీయంగా తగ్గించటానికే తెరాస అధినాయకత్వం ఈ ఎత్తుగడలు వేస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications