జగన్, బాబులకు నో: తీర్మానం తర్వాత కొత్త పార్టీ!
కాంగ్రెసు పార్టీ తెలంగాణ వైపు వడివడిగా అడుగులు వేస్తుండటంతో కొత్త పార్టీ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. సిడబ్ల్యూసి నిర్ణయం అనంతరం పలువురు సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు తరుచూ కొత్త పార్టీ అంశంపై స్పందించారు. మూడు రోజుల క్రితం తెలంగాణకు కేబినెట్ ఆమోదం తెలపడంతో కొత్త పార్టీపై మరోసారి ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కొత్త పార్టీ రావొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ వచ్చే అవకాశాలు లేకపోలేదని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు శనివారం అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లిపోవాలనే తన మనసులో ఉందని, ఒక్కడినే వెళ్లడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని తాను భావించడం లేదన్నారు.

అసెంబ్లీలో తెలంగాణ అంశంపై తీర్మానం తర్వాత కొత్త పార్టీపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. తాము వెళ్లడానికి ఏ పార్టీ లేదని కొత్త పార్టీ పుట్టుకు రావొచ్చునని అభిప్రాయపడ్డారు. యాభై సంవత్సరాల నుండి తెలంగాణ దోపిడీకి గురవుతూనే ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శాస్త్రీయంగా లేదన్నారు. ఫ్యూడల్ వ్యవస్థ వల్లనే నక్సలిజం వచ్చిందని, భూస్వాముల చేతుల్లో ఉన్న భూములు పేదలకు దక్కాయని మంత్రి పేర్కొన్నారు.
మన రాష్ట్రంలో గత అరవై సంవత్సరాలుగా సమన్యాయమే జరిగిందన్నారు. బలవంతంగా విడదీయడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. కాంగ్రెసు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రాజీనామా అనేది చివరి అస్త్రం అన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా అధికారంలో ఉండటం వల్లనే సీమాంధ్ర ఉద్యమంలో ఒక్క రబ్బరు తూటాలనైనా ప్రయోగించవద్దని పోలీసులను ఆదేశించగలిగారని చెప్పారు.
కాగా, శత్రుచర్ల విజయరామారావు ఏ అభిప్రాయంతో ఉన్నారో పలువురు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు అదే అభిప్రాయంతో ఉన్నారట. అటు తెలుగుదేశం, ఇటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లలేని పలువురు నేతలు కొత్త పార్టీపై ఆలోచిస్తున్నారట. పార్టీని వదిలి పోవాలనే ఆలోచనలో కొందరు ఉన్నారంటున్నారు. వారంతా కలిసి ఓ పార్టని స్థాపించవచ్చునని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications