నిత్యానంద ఎక్స్ పోర్ట్స్ ఏమిటి?
ఆశ్రమానికి వచ్చే భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయడం ముఖ్యోద్దేశ్యంగా ఈ వ్యాపార కేంద్రాన్ని స్థాపించారు. ఈ కేంద్ర వ్యవహారాలను నిత్యానంద సోదరుడు నిర్వహించేవాడని, రాసలీలల సీడీలను బహిర్గతం చేసిన నిత్యానంద డ్రైవర్ లెనిన్ కురుపన్ మరో బాంబ్ విసిరారు. ధ్యానం చికిత్సల పేరిట సుమారు 11.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు కురుపన్ ఆరోపించారు.
2009 నవంబర్, డిసెంబర్ నెలల్లో 250 మంది విదేశీ భక్తుల నుంచి 6 వేల డాలర్లను హీలింగ్ ధ్యానం పేరిట వసూలు చేసినట్టు ఆయన తెలిపారు. ఇదే కాకుండా ఆశ్రమం లోపల సుమారు రూ.6 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. బిడది వద్ద ఉన్న ఆశ్రమం వ్యాపార కేంద్రంగా ఉండి నవంబర్లో జరిగిన మూడు నెలల హీలింగ్లో పాల్గొన్న నూరు మంది నుంచి 8 వేల డాలర్లను వసూలు చేసినట్టుగా ఆయన ఆరోపించారు.
ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే సుమారు 4 కోట్ల వరకు సేకరించారన్నారు. నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన 4 రోజుల ఎన్ఎస్పి కార్యక్రమంలో పాల్గొన్న మూడు వేల మంది ప్రతినిధుల వద్ద నుంచి ఒక్కొక్కరి వద్ద 5 వేలు వసూలు చేసి మొత్తం రూ.1.5 కోటి వసూలు చేసినట్లు తెలిపారు. కొన్ని కుటుంబాలకు చేసే పడపూజ పేరిట పది నిమిషాల కార్యక్రమానికి 25 వేలు వసూలు చేయగా, విదేశీ భక్తులకు ప్రత్యేక ధరలు నిర్ణయించేవారన్నారు.