కెసిఆర్ జోష్: అతి పెద్ద పార్టీగా తెరాస?
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెరాసకు 12 లోకసభ స్థానాలు వస్తాయని సర్వే తేల్చింది. ఈ లెక్కన తెరాస అత్యధిక శాసనసభా స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా శాసనసభలో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని తెరాస వర్గాలు చెప్పుకుంటున్నాయి. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సీట్లను గెలుచుకుంటాయని, తెలంగాణలో ఏకపక్ష ఫలితం వెలువడి తాము అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని తెరాస వర్గాలంటున్నాయి.
రాష్ట్ర శాసనసభలో 294 స్థానాలున్నాయి. దానివల్ల తెరాస 70 - 80 స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏకపక్షంగా ఫలితాలు సాధించలేదనే విషయం సర్వే వల్ల అర్థమవుతోందని అంటున్నారు.
సీమాంధ్రలో మూడు పార్టీలో సీట్లను పంచుకుంటాయని, తెలుగుదేశం పార్టీ పూర్తిగా పెకలించుకుని పోలేదని, చెప్పాలంటే దాని పరిస్థితి కాంగ్రెసుకన్నా మెరుగ్గా ఉందని అంచనా వేస్తున్నారు. టిడిపికి 10 లోకసభ స్థానాలు, కాంగ్రెసుకు 7 లోకసభ స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. ఈ లెక్కన టిడిపి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పోటీ గట్టిగానే ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఏమైనా, కెసిఆర్ జోష్కు అడ్డుకట్ట వేసేవారు లేకుండా పోయారు.