'రహస్య సర్దుబాటు'పై జగన్ పార్టీలో ఆందోళన
సిపిఎంతో పొత్తు ప్రచారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆశావహులను ఆందోళనకు గురి చేస్తున్నాయట. గత కొద్ది రోజులుగా సిపిఎంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీట్ల సర్దుబాటు చేసుకుందని, 2014 ఎన్నికల కోసం ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆ రెండు పార్టీల మధ్య వచ్చే ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటు ఒప్పందం జరిగిందని, దానిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
పలువురు కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లెఫ్ట్ పార్టీలు అవినీతి వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకోవడం, సీట్లు ఓట్ల కోసం ప్రయత్నాలు చేయడం విడ్డూరమన్నారు. ఇతర పార్టీలు ఇలా విమర్శిస్తుంటే ఈ 'సర్దుబాటు' విమర్శలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయట. వచ్చే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. సిడబ్ల్యూసి నిర్ణయం అనంతరం పలువురు కాంగ్రెసు నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు చేరారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశ్యంతోనే అని చెబుతున్నారు. అయితే సిపిఎంతో సీట్ల సర్దుబాటు అంశం ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోని టిక్కెట్ ఆశావహులను ఇరకాటంలో పెడుతోందట.
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుంది. ఇలాంటి సమయంలో సిపిఎంతో సీట్ల సర్దుబాటు అనే ప్రచారానికి తెరలేవడం కొందరిని ఇబ్బందులకు గురి చేస్తోందట. సిపిఎంతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ దాదాపు ఇరవై నుండి ముప్పై సీట్ల వరకు కోరే అవకాశముంది. ఏఏ స్థానాలు సిపిఎం అడుగుతుందనే టెన్షన్ ఆశావహుల్లో కనిపిస్తోందని అంటున్నారు.