జూఎన్టీఆర్ నో: కార్యకర్తలకి లోకేష్ పాదాభివందనం!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బుధవారం మహానాడు రెండోరోజు మాట్లాడారు. నారా లోకేష్ను వేదిక పైకి పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పిలిచారు. మహానాడు కార్యక్రమంలో ఓ యువకుడు వేదిక కింద నిలబడి చూస్తున్నారని, ఇటీవలి ఎన్నికల్లో నీతిని గెలిపించేందుకు తాను ఓ సైనికుడిలా మారారని, బాధ్యతల్లో భాగస్వామి అయ్యారని, హక్కుల గురించి ఆయనకు అవసరం లేదన్నారు. ఆ యువనేత లోకేష్ అని.. ఆయన వేదిక పైకి వచ్చి మాట్లాడాలని సూచించారు.
పయ్యావుల ఆహ్వానంతో నారా లోకేష్ వేదిక పైకి వచ్చి మాట్లాడారు. ప్రారంభంలో ఆయన చంద్రబాబు, ఎన్టీఆర్, కార్యకర్తలను నమస్కరించారు. తెలుగు జాతిలో ఏకైక నాయకుడు చంద్రబాబుకు నమస్కారమని లోకేష్ నమస్కరించగా.. చంద్రబాబు ప్రతినమస్కారం చేశారు.

తనకు లోకేష్ అని పేరు పెట్టి దీవించిన తాతగారికి నీరాజనాలు అన్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ముప్పై మూడేళ్లుగా ఎత్తిన పసుపు జెండాను మడమ తిప్పకుండా పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలకు పాదాభివందనం అన్నారు. మహానాడులో మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
భావి టిడిపి నాయకుడు లోకేషే!
మహానాడు ద్వారా నారా లోకేషే టిడిపి భావి నాయకుడని అర్థమవుతోంది. పయ్యావుల యువనేత అంటూ ప్రత్యేకంగా ఆహ్వానించారు. నారా లోకేష్... బాధ్యతల గురించి తప్ప, హక్కుల గురించి ఆలోచించరని పయ్యావుల చెప్పారు. పయ్యావుల హక్కులను ప్రస్తావించటం... జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించే కావొచ్చంటున్నారు.
ఆ తర్వాత లోకేష్ మాట్లాడుతూ.. తాను తన ఇంట్లో ఒక్కడినేనని, తనకు అన్నదమ్ములు, అక్కచెల్లెల్లు లేరని, తనకు అండగా ఉన్నది ఆరు లక్షల మంది టిడిపి కార్యకర్తలే అన్నారు. లోకేష్ క్రమంగా పార్టీలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తద్వారా టిడిపి భావినేత జూనియర్ ఎన్టీఆర్ కాదని... లోకేషే అని స్పష్టమవుతోందంటున్నారు. కార్యకర్తలకు పాదాభివందనం అన్న లోకేష్కు పయ్యావుల కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications