తనిఖీల పేరుతో చెన్నై ఛీర్గర్ల్స్ని వేధించిన పోలీసులు
రాయ్పూర్: చెన్నై ఫ్రాంజైజీకి చెందిన ఛీర్ గర్ల్స్కు రాయ్పూర్ లోకల్ పోలీసుల నుంచి సోదాల పేరుతో వేధించారు. ఈ ఘటన బుధవారం రాత్రి రాయ్పూర్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగింది.
రాయ్పూర్లోని కొట్వాలీ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసులు(మహిళా పోలీసులు కూడా ఉన్నారు) మూడు ఎస్యూవీ వాహానాల్లో పెద్ద సంఖ్యలో నగరంలోని చెన్నై సూపర్ కింగ్స్కు చెందిన ఛీర్ గర్ల్స్ బస చేసిన హోటల్పై దాడులు నిర్వహించారు.
ఛీర్ గర్ల్స్ ఉన్న గదులను క్షుణ్ణంగా పరిశీలించిన రాయ్పూర్ పోలీసులు సుమారు గంట పాటు ఛీర్ లీడర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే పోలీసులకు ఈ సోదాలు నిర్వహించేందుకు ఎలాంటి వారెంట్ లేకున్నా, గదుల్లోకి ప్రవేశించి ఈ సోదాలేంటని ఛీర్ గర్ల్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సోదాలు ఛీర్ గర్ల్స్లో కాస్తంత ఆందోళనను కలిగించాయని హోటల్ వర్గాలు తెలిపాయి. దీంతో వెంటనే చెన్నైకి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ అధికారులు ఫోన్ చేశారు. ఐపీఎల్ మ్యాచ్ని కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్ట్లను సైతం పోలీసులు వదల్లేదు.
హోటల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ తనిఖీల పేరుతో క్షుణ్ణంగా పరిశీలించారు. ఐపీఎల్ టోర్నమెంట్లో పాల్గొంటున్న ఎక్కువ మంది ఛీర్ గర్ల్స్ ఆస్టేలియా, ఇంగ్లాండ్కు చెందిన వారే కావడం విశేషం. మా పట్ల పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉందని ఓ ఛీర్ గర్ల్ అన్నారు.
హోటల్లో సోదాలపై స్పందించిన సిటీ ఎస్పీ సింగ్ శిశోడియా మాట్లాడుతూ ఇది రోటీన్ తనిఖీ మాత్రమేనని అన్నారు. కొట్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక హోటల్లో విదేశీ అమ్మాయిల గురించి సమాచారం ఇవ్వడంతో తనిఖీలు నిర్వహించామన్నారు.