నితీష్ సర్కార్ తాగుబోతుల మయమా..!
పాట్నా: ఎన్నికలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినంత మాత్రానా.. అయిదేళ్ళపాటు స్తబ్దుగా ఉండిపోదామనుకుంటే ప్రజలు ఆయా పార్టీలను పూర్తిగా మరిచిపోవడం ఖాయం. మలి దఫా పట్టు నిలుపుకోవాలనుకున్నా..! జనంలో కోల్పోయిన విశ్వాసాన్ని మళ్ళీ నిలబెట్గుకోవాలన్నా..! అధికారం పక్షం తప్పులను ఎప్పటికప్పుడు ఎండగట్టడం అనివార్యం. ఇప్పుడు సరిగ్గా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు బీహారీ బీజేపీ నేతలు.
గతేడాది నితీష్ కూటమి చేతిలో చావు దెబ్బ తిన్న బీజేపీ.. నితీష్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి సమయంలో నితీశ్ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుకొడుతూ మీడియా కంటికి చిక్కడం బీజేపీకి మంచి అవకాశంగా మారింది.
సదరు ఎమ్మెల్యే తనతో పాటు ఉన్న మిగిలిన నేతలను కూడా మందు కొట్టాలని కోరటం.. తన దగ్గరున్న ఫారిన్ బ్రాండ్ల గురించి గుక్కతిప్పుకోకుండా చెప్పడం చూసి బీహారీ జనంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఖంగు తిన్నది.
దొరికిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీ.. తాగుబోతు నేతలున్న నితీష్ సర్కార్ సంపూర్ణ మధ్యపాన నిషేధం అమలవుతుందని చెప్పడం హాస్యాస్పదం అంటూ జనంలో నితీష్ మైలేజ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
నితీశ్ సర్కారులోని మంత్రులు.. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు చాలావరకు తాగుబోతులేనని జనంలో నితీష్ సర్కార్ ని పలుచన చేసేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సుశీల్ కుమార్. మరోవైపు జరిగిన డ్యామేజ్ ని ఎలా కవర్ చేసుకోవాలా..! అని నితీష్ సర్కార్ తల పట్టుకుంది.
ఇదంతా ఇలా ఉంటే స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రం తాను పూర్తి వెజిటేరియన్ అని.. తనకు అసలు మందుకొట్టే అలవాటే లేదని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ వివాదానికి ముగింపు ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.