జాగ్రత్త! బాబును జగన్ తిట్టమంటున్నారు: రోజాకు వేదిక పైనే ఇలా.. (వీడియో)
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో శనివారం నాడు విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. చంద్రబాబును తిట్టాలని పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే రోజాకు చెబుతుండగా..
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో శనివారం నాడు విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. చంద్రబాబును తిట్టాలని పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే రోజాకు చెబుతుండగా.. అది మైకులో కూడా వినిపించిందని అంటున్నారు.
గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల ప్రాంగణంలో వైసిపి ప్లీనరీ జరిగింది. శనివారం రోజా మాట్లాడారు. ఆమె మైక్ ముందుకు రాగానే సీనియర్ నేత ఉమ్మారెడ్డి ఆమె వద్దకు వచ్చారు.
చంద్రబాబును తిట్టాలని జగన్ సూచించాడని చెప్పారని చెబుతూ ఈ మేరకు ఓ వీడియో నెట్లో హల్చల్ సృష్టిస్తోంది. చంద్రబాబును బాగా తిట్టమని జగన్ చెప్పాడని ఉమ్మారెడ్డి.. రోజాతో చెప్పారు. దానికి రోజా సరేనని చెప్పారు. చంద్రబాబును తిట్టమని జగన్ పదిసార్లు చెప్పారని, సరిగా వినపడకపోవడంతో రోజా ఎవర్ని అని అడగడం, దానికి ఉమ్మారెడ్డి మళ్లీ చెప్పడం.. ఆ సమయంలో మైక్ ఆన్ అయి ఉండటం చర్చనీయాంశంగా మారింది.
'అమ్మాయి ఒకటికి పదిసార్లు చెబుతున్నాడు.. తిట్టమని' అని ఉమ్మారెడ్డి చెప్పారని, దానికి రోజా ఎవరిని తిట్టమన్నారని అడగ్గా.. చంద్రబాబుని తిట్టమంటున్నారని, జాగ్రత్త అని ఉమ్మారెడ్డి బదులిచ్చారని అంటున్నారు.
ఎన్టీఆర్ కుటుంబానికి ఆ పార్టీపై ప్రేమ లేదు!
ప్లీనరీ వేదకపై రోజా.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు ఛరిష్మా లేదనే ఎన్టీఆర్ ఫోటోను వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత మహానాడులో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవరూ కనిపించలేదని, దానిని బట్టే ఎన్టీఆర్ కుటుంబానికి ఆ పార్టీపై ఎంత పట్టు ఉందో అర్థమవుతుందన్నారు. గతంలో ఎన్టీఆర్ చిత్రపటాలను కూడా చంద్రబాబు తీయించేశారన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి నాటి సిద్ధాంతాలేవీ ఆ పార్టీలో ఇప్పుడు లేవన్నారు.
జగన్ ఆస్తులపై మాట్లాడాల్సిన అవసరం లేదు
కేవలం ఎన్టీఆర్ పేరును ప్రచారం కోసం, ఎన్నికల్లో విజయం సాధించడం కోసం మాత్రమే వాడుకుంటున్నారని రోజా తెలిపారు. జగన్లా సొంతంగా పార్టీ పెట్టి, ప్రతిపక్షంలో కూర్చుని, అధికారంలో ఉన్న పార్టీతో సమర్థవంతంగా పోరాడితే సత్తా తేలిపోతుందన్నారు. ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్తే ఆయనకు ఎవరూ ఓటేయరన్న విషయం చంద్రబాబుకు తెలుసన్నారు. జగన్ తన ఆస్తులను ప్రతి ఏటా ఎన్నికల సంఘానికి సమర్పిస్తారని, వాటిపై కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.
సొంత అన్నలా చూసుకున్నారు
డ్వాక్రా మహిళలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని రోజా అన్నారు. మద్యాన్ని యథేచ్ఛగా అమ్ముకునేలా చేస్తూ ఆడవారి జీవితాలని రోడ్డున పడేలా చేస్తున్నారన్నారు. బజారుకో బీరు షాపు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆడవారి కన్నీళ్లలో చంద్రబాబు కొట్టుకుపోతారన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఓ అన్నగా భావించారన్నారు. సొంత అన్న ముఖ్యమంత్రి అయితే తన చెల్లెళ్లని ఎలా చూసుకుంటారో వైయస్సార్ అలా చూసుకున్నారన్నారు. మహిళలకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగే అవకాశాలను ఇచ్చారన్నారు. వారిని ముందుకు నడిపించారన్నారు. తాను జగన్ అన్నని ఒక చెల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నానని, అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలపై మహిళలకు న్యాయం చేయాలన్నారు.
డిజిపినే చెప్పారు
జగన్ అన్న చంద్రబాబు నాయుడి మోసాలను, కుట్రలను అరికట్టి మహిళలకు న్యాయం చేయాలని రోజా కోరారు. డ్వాక్రా రుణాలపై వడ్డీ రూ.10 వేల కోట్లకు చేరిందన్నారు. డ్వాక్రా వ్యవస్థను చంద్రబాబు సర్వనాశనం చేశారన్నారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. పట్టపగలు కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళలపై 11 శాతం క్రైం రేట్ పెరిగిందని రాష్ట్ర డీజీపీనే చెప్పారన్నారు.