జగన్తో కలిసి బిజెపి వ్యూహం: చంద్రబాబు అంచనా ఇదీ
Recommended Video
అమరావతి: మిత్రపక్షాలను లొంగదీసుకునే వ్యూహంలో భాగంగానే బిజెపి తనపై కూడా ప్రయోగం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో కాంగ్రెసు అనుసరించిన వ్యూహాన్నే బిజెపి కూడా మిత్రపక్షాల పట్ల అనుసరిస్తోందని ఆయన అనుకుంటున్నారు.
బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యవహారశైలిని, బిజెపి జాతీయ నాయకత్వం మౌనాన్ని పరిగణనలోకి తీసుకుని తెలుగుదేశం పార్టీ బిజెపి వ్యూహాన్ని అంచనా కట్టే ప్రయత్నం చేస్తోంది.
తమను అణచేసి, జగన్ను ప్రోత్సహించడం ద్వారా..
తమను అణచివేసి, తమ రాజకీయ ప్రత్యర్థి అయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని బిజెపి పరోక్షంగా ప్రోత్సహిస్తోందనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబునే కాకుండా జగన్ను కూడా తమ గుప్పిట్లో ఉంచుకునే ద్విముఖ వ్యూహాన్ని బిజెపి అనుసరిస్తోందని తెలుగుదేశం పార్టీ అనుమానిస్తోంది.
టిడిపిలో సీరియస్గా చర్చ
బిజెపి వ్యూహంపై తెలుగుదేశం పార్టీలో సీరియస్గా చర్చ జరుగుతోంది. చంద్రబాబును దెబ్బ తీయడం, జగన్ను ప్రోత్సహించడం ద్వారా ద్విముఖ వ్యూహాన్ని అనుసరించి వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారితో కలిసి నడిచే విధంగా బిజెపి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు.
మౌనంగా అంటే బలహీనతగా....
రాష్ట్రానికి అన్యాయం చేసినప్పటికీ మౌనంగా ఉంటే దాన్ని బిజెపి బలహీనతగా తీసుకుని తన వ్యూహానికి బిజెపి పదును పెడుతోందని తెలుగుదేశం పార్ీ నాయకులు భావిస్తున్నారు. తమ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ పార్లమెంటు సీట్లు రాకుండా దెబ్బ తీయాలని చూస్తోందని, రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోయినా మౌనంగా ఉంటే ప్రజలు తమనే తప్పు పడుతారు కాబట్టి వైసిపి ప్రయోజనం పొందుతుందని, బిజెపికి కావాల్సింది అదేనని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు.
ప్రత్యేక ప్యాకేజీకి సై అన్నారు..
ప్రత్యేక హోదాను కాదని, దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పినప్పుడు దాన్ని చంద్రబాబు అంగీకరించారు. దాన్ని బిజెపి అలుసుగా తీసుకుందనే అభిప్రాయం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబును బలహీనపరిచి, వైసిపిని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేస్తుందనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో ఉంది.
చంద్రబాబుకు ఇలా, జగన్కు అలా...
చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఏడాదిన్నర తీసుకున్నారు. అదే జగన్కు వెంటనే అపాయింట్మెట్ ఇచ్చారు. పైగా, వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి తరుచుగా ప్రధాని కార్యాలయానికి వెళ్లి వస్తూ రాయబారాలు నడుపుతున్నారని అంటున్నారు. ఇదంతా బిజెపి వ్యూహంలో భాగంగానే జరుగుతోందని అంటున్నారు.