Air Pollution: వాయుకాలుష్యంతో ఇబ్బందుల్లో హార్ట్ పేషెంట్స్.. సరికొత్త రిపోర్ట్ హైలైల్ట్స్ ఇవే..
Heart Diseases: దేశంలో కరోనా తర్వాత గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా మంది ఇవి కొవిడ్ సమయంలో తీసుకున్న వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటుండగా దానిని పూర్తి స్థాయిలో నిరూపించే సాక్ష్యాలు ఇప్పటి వరకు లభించలేదు. కానీ రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యంతో మాత్రం ప్రజలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఊపిరితిత్తుల నుంచి గుండె వరకు అనేక సమస్యలను వాయుకాలుష్యం పెంచేస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న వాయుకాలుష్యం తగ్గిపోతున్న గాలి నాణ్యత హృద్రోగులకు ఆరోగ్య ప్రమాదాలను గణనీయంగా పెంచుతున్నట్లు వెల్లడైంది. ఈ రోగుల శరీరాలు కాలుష్యం వల్ల కలిగే మంటను ఎదుర్కోవడానికి కష్టపడుతున్నాయని చికాగోలోని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2024 సైంటిఫిక్ సెషన్స్లో సమర్పించిన తాజా అధ్యయనం వెల్లడించింది. ఉటాలోని సాల్ట్ లేక్ సిటీలోని ఇంటర్మౌంటైన్ హెల్త్లో పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో రెండు ఇన్ఫ్లమేటరీ మార్కర్లు-CCL27, IL-18-కాలుష్యం వచ్చే సమయంలో గుండె రోగుల్లో బాగా పెరుగుతాయని కనిపెట్టారు. అయితే ఇది గుండె జబ్బులు లేని వ్యక్తుల్లో ప్రభావాన్ని చూపలేదని తేలింది.

ప్రస్తుతం భారతదేశంలో అత్యంత కాలుష్యభరితంగా మారిన నగరాల జాబితాను పరిశీలిస్తే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం దేశరాజధాని దిల్లీ ముందు వరుసలో నిలిచింది. దీని తర్వాత హర్యాణాలోని సోనీపేట్, గురుగ్రామ్ ఉండగా.. కర్ణాటకకు చెందిన గుల్బర్గా తర్వాతి స్థానంలో నిలిచింది. వీటి తర్వాత తమిళనాడులోని తిరుప్రూర్, హర్యాణాలోని ఫరీదాబాద్ ఉన్నాయి. ఇదే క్రమంలో యూపీ నుంచి బులంధర్, ఘజియాబాద్, హర్యాణా నుంచి రోహ్తక్, యూపీ నుంచి మీరట్ దేశంలోని టాప్10 పొల్యూటెడ్ నగరాల జాబితాలో ఉన్నాయి. అయితే నగరాల్లో పొల్యూషన్ పెరిగిపోవటం కార్డియో వాస్కులర్ సమస్యలను కలిగించి మరణాలకు దారితీస్తోందని నివేదిక ప్రకారం తెలుస్తోంది.
భారతదేశంలోని నగరాలు తరచుగా PM 2.5 స్థాయిలను అధ్యయనంలో గమనించిన బెంచ్మార్క్ల కంటే చాలా రెట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇది ఎక్కువ మంది ప్రజలను ప్రమాదంలోనికి నెట్టేస్తోందని తేలింది. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సహకారంతో నిర్వహించిన ఈ పరిశోధనలో గుండె జబ్బులు ఉన్న 44 మంది రోగులు, గుండె జబ్బులు లేని 35 మంది వ్యక్తుల రక్త నమూనాలను విశ్లేషించారు. అధిక కాలుష్యం ఉన్న రోజుల్లో, హార్డ్ స్టోక్ ప్రమాదం ఉన్న రోగులు స్థిరంగా ఇన్ఫ్లమేటరీ మార్కర్ల ఎలివేటెడ్ స్థాయిలను ప్రదర్శిస్తారని అధ్యయనం కనుగొంది. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తుల విషయంలో పెద్దగా మార్పులు కనిపించలేదు. అందుకే కాలుష్యాన్ని తగ్గించి పచ్చదనాన్ని పెంచాలని ప్రభుత్వాలు సైతం ప్రజలకు సూచిస్తున్నాయి. దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.












Click it and Unblock the Notifications