రొయ్యల కారం పొడి.. ఇలా చేస్తే రుచిలో తగ్గేదేలే!
సాంప్రదాయ వంటకాలు మన వంటగదుల్లో ఈ మధ్య కాలంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నాయి. వాటిలో కారప్పొడులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకు ముందు చికెన్ కారం పొడి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సీఫుడ్ ప్రేమికులకు ఇష్టమైన రొయ్యల కారం పొడి తయారీ విధానం తెలుసుకుందాం. ఇది కారం, పులుపు రుచులతో నోరూరించే పొడి. సీఫుడ్ ఇష్టపడేవారికి ఇది ఒక మంచి, బెస్ట్ ఆప్షన్.
కావాల్సిన పదార్థాలు
ఎండు రొయ్యలు - 1 కప్పు
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
మినపప్పు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 12
చింతపండు - నిమ్మకాయ పరిమాణం
ఎండు మిర్చి - 15
కరివేపాకు - 2 రెమ్మలు
ఉప్పు - తగినంత
పసుపు - అర స్పూన్

తయారీ విధానం
ముందుగా ఎండు రొయ్యల తల, తోక భాగాలను తీసి బాగా శుభ్రం చేసుకోండి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి సన్నని సెగ మీద రొయ్యలను క్రిస్పీగా అయ్యే వరకు వేయించి పక్కన పెట్టండి. అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నూనె వేడి చేసి ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఎండు మిర్చి, కరివేపాకులను దోరగా వేయించండి. వాటిని తీసి పక్కన ఉంచి, అదే ప్యాన్లో వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేగనివ్వండి.
నోరూరించే రొయ్యలకారం పొడి రెడీ
వెల్లుల్లి వేగిన తర్వాత చింతపండు వేసి చెమ్మపోయే వరకు ఒక నిమిషం ఉంచి తీసేయండి. అన్ని పదార్థాలు చల్లారిన తర్వాత ముందుగా ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఎండు మిర్చిలను గ్రైండర్లో పొడి చేయండి. తర్వాత కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలను కలిపి మెత్తగా పొడి చేసుకోండి. చివరగా వేయించిన రొయ్యలు, పసుపు, ఉప్పు కలిపి కొద్దిగా బరకగా ఉండేలా మళ్లీ గ్రైండ్ చేయండి. నోరూరించే రొయ్యలకారం పొడి రెడీ.
ఈ పొడి ఇలా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది
ఈ పొడిని అన్నం, ఇడ్లీ, దోసె, రొట్టెలతో కలిపి తినవచ్చు. సీఫుడ్ ఇష్టపడేవారికి ఇది ప్రత్యేకంగా నచ్చుతుంది. కారం, పులుపు కలయికతో రుచి అద్భుతంగా ఉంటుంది.
ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే రొయ్యలు బాగా కరకరలాడేలా వేయించాలి. పొడిని గాలి చొరబడని గాజు సీసాలో నింపి మూత గట్టిగా బిగించి ఉంచండి. తడి తగలకుండా ఉంచితే నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది.ఇలా సాంప్రదాయ పద్ధతిలో ఇంట్లోనే రొయ్యల కారం పొడి తయారు చేసుకుంటే ఆరోగ్యకరంగా, రుచికరంగా ఉంటుంది.













Click it and Unblock the Notifications