ప్రపంచం ముంగిట మరో ప్రాణాంతక వైరస్: కిల్లర్ వర్షన్
ప్రపంచానికి మరో వైరస్ ప్రమాదం పొంచివుంది. కరోనా తరహా ప్రాణాంతక మహమ్మారి ఇది. ఇప్పటికే రెండు దేశాల్లో కోరలు చాచింది కూడా. పలు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయక్కడ. దీని బారిన పడిన ప్రజలు ప్రాణాలు సైతం కోల్పోతోన్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. ఈ వైరస్ ను మహమ్మారిగా ప్రకటించింది. వైరస్ అవుట్ బ్రేక్ అయినట్టు అధికారికంగా నిర్ధారించింది.
అదే.. ఎబోలా వైరస్. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దాని పొరుగున ఉన్న ఉగాండాలో ఎబోలా వైరస్ ప్రబలింది. దీన్ని నివారించడంలో భాగంగా ఈ రెండు దేశాల్లో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. 300కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం, 88 మందికి పైగా స్థానికులు ఈ వైరస్ బారిన పడి మరనించిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత వ్యాప్తికి కారణం బుండిబుగ్యో వైరస్. అరుదైన ఎబోలా రకానికి చెందిన సూక్ష్మ క్రిమి ఇది. దీన్ని అరికట్టడానికి ఎటువంటి చికిత్సలు లేదా టీకాలు ఇప్పటివరకు అందుబాటులో లేవు. కాంగో, ఉగాండాలకు ఎబోలా వైరస్ కొత్తేమీ కాదు. ఇప్పటివరకు 20 సార్లు ఈ వైరస్ ఆయా దేశాల్లో అవుట్ బ్రేక్ అయింది. ఎబోలాలో అత్యంత ప్రమాదకరం, ప్రాణాంతకమైన బుండిబ్యుగో వైరస్ వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
పెద్ద ఎత్తున మరణాలు సంభవించిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రేయెసస్ స్పందించారు. వైరస్ అవుట్ బ్రేక్ వల్ల కాంగో, ఉగాండాల్లో మెడికల్ ఎమర్జెన్సీ విధించినట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ఎక్స్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. పొరుగు దేశాలకు మరింత వ్యాప్తి చెందే అధిక ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వైరస్ మొదట శుక్రవారం కాంగో తూర్పు ప్రాంతంలోని ఇటూరి ప్రావిన్స్ వ్యాప్తిచెందింది. శరవేగంగా వ్యాప్తి చెందింది. ఇక్కడ వెలుగులోకి వచ్చిన అతి తక్కువ సమయంలో ఉగాండా, దక్షిణ సూడాన్ సరిహద్దు ప్రాంతాలకు విస్తరించింది. శనివారం నాటికి 336 పాజిటివ్ కేసులు, 88 మంది మరణించినట్లు ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది.
అదే రోజు కాంగో నుండి వచ్చిన ఒక వ్యక్తి వైరస్ బారిన పడి కంపాలాలోని ఆసుపత్రిలో మరణించాడు. దీని తర్వాత కంపాలాలో రెండవ కేసు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించింది. ఈ రెండు కేసులు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నట్లు కనిపించలేదని, రోగులు ఇద్దరూ DRC నుండి వచ్చినట్టు గుర్తించామని తెలిపింది.
కాగా.. బుండిబ్యుగో వైరస్ ఊహించిన దాని కంటే వేగంగా పొరుగు దేశాలకు ప్రబలుతోందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. పాజిటివ్ కేసులు పెరగకుండా దేశీయ ప్రయాణాలపై పరిమితులు విధించాలని, వ్యాధికి గురైన 21 రోజుల వరకు అంతర్జాతీయ ప్రయాణాలను నిలిపివేయాలని సిఫార్సు చేసింది. సరిహద్దులను మూసివేయడం లేదా ప్రయాణాలు, వాణిజ్య పరిమితులు విధించవద్దని ఆయా దేశాలకు సూచించింది.
ACDCP ప్రకారం, తరచుగా ప్రాణాంతకమైన, అత్యంత అంటువ్యాధి అయిన ఈ వైరస్ జ్వరం, ఒళ్ళు నొప్పులు, వాంతులు, అతిసారం వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది సోకిన వ్యక్తుల శరీర ద్రవాలు, కలుషితమైన వస్తువులు లేదా వ్యాధితో మరణించిన వారి మృతదేహాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది.












Click it and Unblock the Notifications