ప్రత్యేక మాసము: సన్యాసుల దీక్ష-చాతుర్మాస్యం మొదలు
ఆషాఢమాసము రైతులకి, ముత్తైదువలకి, మాత్రమే కాకుండా సన్యాసులకి కూడా ఒక ముఖ్యమైన మాసము. అన్ని ఆశ్రమాలలోను సన్యాసము ప్రాముఖ్యతని కలిగి ఉన్నది. వారు చేసే కార్యక్రమాలు ఆసక్తి కరంగా ఉంటాయి.
హైదరాబాద్: ఆషాఢమాసము రైతులకి, ముత్తైదువలకి, మాత్రమే కాకుండా సన్యాసులకి కూడా ఒక ముఖ్యమైన మాసము. అన్ని ఆశ్రమాలలోను సన్యాసము ప్రాముఖ్యతని కలిగి ఉన్నది. వారు చేసే కార్యక్రమాలు ఆసక్తి కరంగా ఉంటాయి.
ఆషాఢశుక్ల ద్వాదశి ఆషాఢ శుక్ల ద్వాదశి చాతుర్మాస్య వ్రతారంభదినమనీ స్మృతికౌస్తుభము చెబుతూవుంది. ఆనాడు ఈ వ్రతం ప్రారంభించడానికి వీలులేనివారు ఆషాఢశుద్ద పూర్ణిమనాడు కానీ, కర్కాటక సంక్రాంతినాడుకాని చేయవచ్చు. ఏనాడు ప్రారంభించినా ఈ వ్రత సమాప్తి కార్తీకశుద్ధ ద్వాదశినాడే ఇది యతులకు ముఖ్యమైన వ్రతం.

వ్రతంచేసే యతులకు ఆశ్రయం ఈయవలసిన బాధ్యత గృహస్తులు వహించాలి. గృహస్తులు ఈ వ్రతాన్ని ఆచరింపవచ్చును. యతులు మున్ముందుగా వ్యాస మహర్షి పూజచేయాలి. ఆమీద ముండనం చేయించుకోవాలి. మళ్ళీ వ్రతసమాప్తి అయ్యేవరకు క్షురకర్మ చేయించుకోకూడదు. చాతుర్మాస్యవ్రతం చేసేవారు వ్రతంపూర్తి అయ్యేవరకు నిమ్మపళ్ళు అలసందెలు, ముల్లంగి, గుమ్మడికాయ, చెరుకుగడలు - వీనిని తినకూడదని శాస్త్రవచనం. వీనిని బొత్తిగా పరిహరించి మొదటినెలలో కూరలు మాత్రము, రెండవ నెలలో పెరుగు మూడవ నెలలో పాలు నాల్గవ నెలలో ద్విదళ (రెండాకులుండే) పత్రశాకములు అన్నాధరువులుగా ఉపయోగించాలి. కూరలు, పచ్చళ్ళు వగైరా ఇతరములు ఏవీ తీసుకొనకూడదు.
ఉసిరిక ఒలుపు యధేచ్ఛగా వాడవచ్చును. ఈ నియమాలన్నీ శరీర సౌష్టవము కోసమే కావడం సులభంగానే వూహింపవచ్చు. సన్యాసి అగువాడు గ్రామైకరాత్రుడై
(అనగా ఒక్కొక్కరాత్రి ఒక్కొక్క వూరిలో గడిపేటువంటివాడై) ఉండాలి. కాని వర్షాకాలము నాలుగు నెలలు అతడు ఒక్కచోటనే గడపవచ్చును. అట్లు గడపడమే చాతుర్మాస్యవ్రతం.
బౌద్ధులకి కూడా ఇదే విధి
ఈ చాతుర్మాస్యవ్రతం హిందూ మతస్తులలోనే కాక బౌద్ద మతస్తులలో కూడా ఉంది. హిందువులలోవలె బౌద్దులలో కూడా అది ఆషాఢంలోనే ప్రారంభమవుతుంది.
హిందూమతస్తులు ఈ పండుగను జరిపే తీరు కొంత తెలిసి కొన్నాము. బౌద్దులు దీన్ని ఎట్లా జరుపుతారో తెలిసికోవడానికి ముచ్చటగా ఉంటుంది. రంగూన్లోని విద్యావేత్తలలో ఒకరైన 'శ్రీమతాన్ ' అనువారు ఈ పండుగ బౌద్దులచే ఆచరింపబడేతీరును ఇటు వ్రాస్తున్నారు.
వాసోమాసపు పూర్ణిమకు బౌద్దుల చాతుర్మాస్యవ్రతం మొదలవుతుంది.
'వాసో వృక్షం' మతవిధులు ప్రబలంగా పాటింపవలసిన ఆ వ్రతం వారిలో వనాల్లో విచ్చలవిడిగా తిరిగే విధులతో మొదలవుతుంది. పౌర్ణమి వెళ్ళిన పాడ్యమినాడు యువకులు యువతులు కలసి వనాలకు చిట్టడవులకు వెళతారు. వాసో వృక్షం ఆ రోజుల్లో ముమ్మరంగా పూసి ఉంటుంది. ఆ పూలు పసుపుపచ్చగా చాలా ఆకర్షనీయంగా ఉంటాయి.












Click it and Unblock the Notifications