ఇందిరమ్మ ఇళ్లు వీరికే- దరఖాస్తులు, అర్హతలు, కేటాయింపు ఇలా..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులకు అందరికీ అందే విధంగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా దరఖాస్తు ప్రక్రియను సలభతరం చేసింది. మార్గదర్శకాలతో పాటుగా వీటి కేటాయింపు అర్హతలు ఖరారయ్యాయి. అర్హులు తమ మొబైల్ నుంచే దరఖాస్తు పూర్తి చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రత్యేకంగా లబ్దిదారులకు హెల్ప్ డెస్క్ లు అందుబాటులోకి తెచ్చారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు లో ప్రభుత్వం కొత్త మార్పులు తెచ్చింది. లబ్దిదారులకు ఇళ్లు పొందే ప్రక్రియ మరింత సులభతరం చేసింది. దరఖాస్తు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా డిజిటల్ చేసింది. వాట్సాప్, మీ సేవ వెబ్సైట్, హెల్ప్డెస్క్ల ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు, అర్హతలు, చివరి తేదీ, హెల్ప్లైన్ నంబర్లను కూడా ప్రకటించింది. హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ పరిధిలో దరఖాస్తులకు 2026 ఆగస్టు 10 వరకు గడువుగా నిర్ణయించింది. వాట్సాప్ ద్వారా 80969 58096 నంబర్కు అవసరమైన వివరాలు పంపించి దరఖాస్తు చేసుకోవచ్చు. meeseva.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

తాజా మార్గదర్శకాలు
కాగా, దరఖాస్తుదారులకు కావాల్సిన సమాచారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్లైన్లను అందుబాటులో ఉంచింది. టోల్ ఫ్రీ నంబర్: 1800 599 5991, సాధారణ సమాచారం కోసం: 040-24603572 కాల్ చేయవచ్చు. ఫోన్ కాల్స్తో పాటు సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రశ్నలకు కూడా అధికారులు వీడియోల రూపంలో సమాధానాలు ఇస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. అర్హులైన వారు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హతలు విషయానికి వస్తే.. తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత నివాసితులై ఉండాలని చెబుతున్నారు. సొంత పక్కా ఇల్లు లేని పేద లేదా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రాధాన్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల పేరుపై పక్కా ఇల్లు ఉండకూడదు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ప్రజాపాలన సర్వే లేదా స్థానిక ఇందిరమ్మ కమిటీ ద్వారా అర్హులుగా గుర్తింపు పొందిన వారికే ప్రాధాన్యత దక్కనుంది.













Click it and Unblock the Notifications