ఐటి పుస్తకాలకూ మాంద్యం
బెంగుళూరు: అనేక మంది ఐటి నిపుణులు ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైన ఐటి మాంద్యం ప్రభావం పుస్తకాల మార్కెట్పై కూడా పడింది. ఐటి పుస్తకాలు ముఖ్యంగా మొన్నటివరకు హాట్కేకుల్లా అమ్ముడుపోయిన ఇ-కామర్స్, జావా పుస్తకాలను కొనేవారు కనిపించడం లేదు. కంప్యూటర్ పుస్తకాలకు ముఖ్యంగా జావా సంబంధిత పుస్తకాలకు గత రెండు మూడు నెలలుగా డిమాండ్ తగ్గిందని పుస్తకాల దుకాణాల యజమానులు అంటున్నారు.
అయితే ఈ మధ్యనే ఒరకిల్, డాట్నెట్, ఫ్లాష్, సిప్లస్ప్లస్ పుస్తకాలకోసం మాత్రం అడుగుతున్నారని వారు చెబుతున్నారు. అమెరికా ఐటిలో మాంద్యం వల్ల ఐటి పుస్తకాల వ్యాపారంలో మొత్తం మీద 20-25 శాతం మేర తరుగుదల వున్నదని వారు అంటున్నారు. జావా పుస్తకాల అమ్మకాలు మాత్రం75 శాతం మేర తగ్గాయి. తామరతంపరగా పుట్టుకొచ్చిన ఐటి శిక్షణ సంస్థల్లో అనేకం మాంద్యం కారణంగా మూతపడటం వల్ల కూడా పుస్తకాల అమ్మకాలు తగ్గాయి.
అమ్మకాలు తగ్గినప్పటికీ పుస్తకాల దుకాణాలకు వచ్చే నష్టం ఏమీలేదు. ఈ రంగంలో రోజురోజుకు కొత్త పుస్తకాలు వస్తున్న కారణంగా అమ్మకుండా మిగిలిపోయిన పాతపుస్తకాలను పబ్లిషర్స్కు వాపస్ చేసే వెసులుబాటు తమకు వున్నదని వారు చెబుతున్నారు. ఐటి రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపే నిపుణులు పుస్తకాలపై కూడా బాగానే వెచ్చిస్తుంటారని పుస్తకాల దుకాణాల యజమానులుఅన్నారు.
- అర్జూకు సబీర్ భాటియా తాళం