పాక్ అధ్యక్ష పీఠంపై ముషారఫ్
ఇస్లామాబాద్: సైనిక పాలకుడు జనరల్ పర్వాజ్ ముషారఫ్ తన అధికారాలను సంఘటితం చేసుకునే కార్యక్రమంలో పడ్డారు. ప్రధాన రాజకీయ పార్టీల తీవ్ర నిరసన వ్యతిరేకత మధ్య పాకిస్తాన్ అధ్యక్షునిగా ఆయన బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి ఇర్షాద్ హసన్ ఖాన్ అధ్యక్షుని భవనంలో జరిగిన ఉత్సవంలో ముషారఫ్చే కొత్త అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
దేశ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన ముషారఫ్ సైనిక దళాల అధిపతిగా కూడా కొనసాగుతారు. పాక్ గద్దెనెక్కి అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన సైనికపాలకుల్లో ముషారఫ్ నాలుగవారు. వచ్చేనెల భారతతో శిఖరాగ్ర చర్చలకు వస్తున్న ముషారఫ్ అధికార హోదాలో భారత ప్రధాని వాజ్పేయితో సమానంగా వుండేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుని వుంటారని భావిస్తున్నారు. పాకిస్తాన్ రాజ్యాంగ ప్రకారం దేశాధ్యక్షునికి లాంఛనప్రాయమైన అధికారాలే వుంటాయి. అయితే ముషారఫ్ కారణంగా ఈ అధికారాలను విస్తరించే అవకాశం వుంది.
బుధవారం నాడు మొదట పాక్పార్లమెంట్ను, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేస్తున్నట్టుగా సైనికప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత రద్దయిన పార్లమెంట్ ఎన్నుకున్న అధ్యక్షుడు రఫీక్ తరార్ను పదవినుంచి తొలగిస్తున్నట్టుగా మరో ప్రకటన వెలువడింది. తరార్ స్థానంలో అధ్యక్షల బాధ్యతలను స్వీకరించిన ముషారఫ్ పాకిస్తాన్లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు తాము కట్టుబడి వున్నట్టుగా ప్రకటించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం తాను వచ్చే అక్టోబర్ లోపల ఎన్నికలను నిర్వహించనున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ ఎన్నికల కంటే ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తానని ఆయన పాక్ప్రజలకు హామీ ఇచ్చారు.
1999లో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను తొలిగించి అధికారంలోకి వచ్చిన ముషారఫ్ గత రెండేళ్ల కాలంతో క్రమంగా అధికార పీఠంపై తన పట్టును బిగించారు. అధ్యక్షుడు తరార్ను తొలిగించడానికి ముందుగా ఆయనతో రెండు మూడు గంటలపాటు సమావేశమై చర్చలు కూడా జరిపారు. ఇదిలా వుండగా పాకిస్తాన్ పరిణామాలు ఆ దేశ అంతర్గతవ్యవహారాలని వాటిపై వ్యాఖ్యానించడానికి భారత్లో ప్రధాన పార్టీలు నిరాకరించాయి.