కరీంనగర్లో సిఎంకు భంగపాటు
కరీంనగర్: పంచాయతీ రాజ్ ఎన్నికల ప్రచారానికి గురువారం నాడు కరీంనగర్జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతికూల పరిస్థితిని ఎదుర్కున్నారు. జిల్లాలో జరిగిన సభల్లో ఒకటి రద్దు కాగా మరో సభ జనం లేక వెలవెలపోయింది.
జిల్లా నేతల మధ్య సమన్వయ లోపం, జిల్లాలో తెలంగాణా ఉద్యమం బలంగా వుండటం, నక్సలైట్ల హెచ్చరిక తదితర కారణాల వల్ల ముఖ్యమంత్రి జిల్లాలో అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కోవల్సివచ్చింది. జిల్లాలో సిఎం తొలిదఫాగా రెండు సెగ్మెంట్లలో పర్యటించడానికి జిల్లా నేతలకు ముందుగానే సమాచారం పంపారు.
జిల్లా నేతలు ఎలాంటి ప్రణాళిక లేకుండానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల, మంథని సెగ్మెంట్లోని కాటారంను ఎంపిక చేశారు. కాటారం స్థానాన్ని ముందుగా బిజెపికి కేటాయించారు. పొత్తు బెడసికొట్టడంతో తెలుగుదేశం అభ్యర్ధిని రంగంలోకి దించారు. ఆ సమయంలోనే సిఎం కాటారం సభను ఖరారు చేశారు. అయితే చివరి నిమిషంలో మళ్లీ పొత్తు కుదరడంతో ఈ తెలుగుదేశం అభ్యర్ధిని రంగంలోంచి తప్పించారు. జిల్లా నేతలు ఈ విషయం పార్టీ అగ్రనాయకత్వం దృష్టికి తీసుకుపోలేదు.
జగిత్యాల సభ కోసం అనంతారం వద్ద ఏర్పాటు చేసిన వేదిక దగ్గరకు ముఖ్యమంత్రి ఉదయం 11 గంటలకల్లా వచ్చారు. అయితే పోలీసులు కొందరు పార్టీ కార్యకర్తలు తప్ప అక్కడ జనం కనిపించక పోవడంతో సిఎం పోలీసులను ఆరా తీసి దగ్గరలో వున్న పోలాస వ్యవసాయ క్షేత్రం గెస్ట్హౌస్కు వెళ్లరు. అక్కడే సభ ఏర్పాట్లపై స్థానిక నాయకులను ముఖ్యమంత్రి తీవ్రంగా మందలించారు. దాదాపు రెండు గంటలు వేచివున్నప్పటికీ సభకు జనం అంతంత మాత్రమే వచ్చారు. కాటారం పరిస్థితిని కూడా శంకించిన ముఖ్యమంత్రి పోలీసుల ద్వారా పరిస్థితిని కనుక్కున్నారు. మంథని సెగ్నెంట్లో భారీ వర్షాలున్నాయని సమాచారం రావడంతో వర్షాల వల్ల సభ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించాల్సిందింగా కాటారంకు సందేశం పంపి ఆయన రెండు గంటల ప్రాంతంలో ఆదిలాబాద్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.